సంగీత ఇష్యూ మరో మలుపు: ఎదురు తిరిగిన భర్త, అలా అయితేనే..
హైదరాబాద్: భర్తపై ఆందోళనకు దిగిన సంగీత వ్యవహారం మరో మలుపు తిరిగింది. భర్త శ్రీనివాస్ రెడ్డి సంగీతపై ఎదురు తిరిగారు. ఆమె ముందు తన డిమాండ్లను పెట్టాడు. తనపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండే చేసారు.
తనపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటే తన మొదటి భార్య సంగీతను కాపురానికి రానిస్తానని బహిష్కృత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత శ్రీనివాస రరెడ్డి చెప్పారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
మేం రోడ్డు మీద ఉంటున్నాం..
తాను, తల్లిదండ్రులు గత 53 రోజులుగా రోడ్డుపై ఉంటున్నామని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తమ ఇంటిని సంగీత అధీనంలోని తీసుకుందని, ఆమెను కొంతమంది తప్పుదోవ పట్టించారని ఆయన అన్నారు.
రూ. 3 కోట్లు డిమాండ్ చేసింది...
తనతో రాజీకి సంగీత రూ. 3 కోట్లు డిమాండ్ చేసిందని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మూడేళ్లుగా రాజీకి ప్రయత్నిస్తున్నామని, అందుకు ఆమె అంగీకరించడం లేదని చెప్పారు. తన పేరు మీద ఎటువంటి ఆస్తులు లేవని, తల్లిదండ్రులపైనే ఆధారపడి జీవిస్తున్నానని అన్నారు.
కూతురంటే నాకు ప్రాణం
తనకుకూతురంటే ప్రాణమని, తనకు వచ్చే ఆస్తి ఆమెకే చెందుతుందని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ప్రత్యేకంగా తన కూతురి పేర ఆస్తి రాయాల్సిన అవసరం లేదని అన్నారు. విభేదాలన్నీ మర్చిపోయి వస్తే సంగీతను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పారు. కేసులు ఉపసంహరించుకుంటేనే ఆమెతో రాజీ పడతానని అన్నారు.
నిరూపిస్తే దీక్ష విరమిస్తా
రాజీ పడడానికి తాను రూ. 3 కోట్లు డిమాండ్ చేసినట్టు నిరూపిస్తే ఇప్పుడే దీక్ష విరమిస్తానని సంగీత తెలిపారు. ఎక్కడోవుండి మాట్లాడం కాదని, ఇంటికి వచ్చి రాజీ గురించి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని ఆమె అన్నారు.
అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం..
అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం శ్రీనివాస్రెడ్డికి సరదా అని సంగీత ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బోడుప్పల్లోని భర్త ఇంటి ముందు సంగీత 53 రోజులుగా ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే.