వైఎస్ జగన్ ఆస్తుల కేసులో శ్రీనివాసన్కు ఊరట
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షు వైయస్ జగన్ ఆక్రమాస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ ఎండీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్కు కొంత ఊరట లభించింది. దిగువ కోర్టులో జరిగే విచారణకు వ్యక్తిగత హాజరునుంచి మంగళవారం హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.
ఆక్రమాస్తుల కేసులో తనను నిందితుడిగా సిబిఐ పేర్కొనడాన్ని కొట్టివేయాలని, సిబిఐ కోర్టులో హాజరుకు మినహాయింపు నివ్వాలని కోరుతూ హైకోర్టులో శ్రీనివాసన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ బీ శివశంకర్రావు ఆధ్వర్యంలోని న్యాయస్థానం విచారణ చేపట్టింది.
కోర్టు విచారణకు శ్రీనివాసన్ హాజరు కావాల్సిన అవసరం లేదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది.
జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ అధికారులు తనపై నమోదు చేసిన కేసులు, చార్జిషీట్లను కొట్టివేయాలంటూ ఇండియా సిమెంట్స్ వైస్ చైర్మన్, ఎండీ ఎన్ శ్రీనివాసన్ హైకోర్టులో ఇటీవల క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవాలను పరిశీలించకుండానే జగన్కు సంబంధించిన కంపెనీల్లో పెట్టుబడుల పెట్టి తాను లబ్ధి పొందినట్లు సీబీఐ అధికారులు కేసును నమోదు చేశారని ఆయన పిటిషన్లో అన్నారు.
తనకు ఇండియా సిమెంట్స్ కంపెనీ ఉందని జగన్కు భారతి సిమెంట్స్ కంపెనీ ఉండేదని శ్రీనివాసన్ వివరించాడు. ఒకే రకమైనా వ్యాపారాలు చేసే సమయంలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండటం వ్యాపార లక్షణమన్నారు. తాను జగన్ సంస్థలలో రూ.140 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు సిబిఐ పేర్కోనడం సరికాదన్నారు. నామమాత్రపు పెట్టుబడులు మాత్రమే ఉన్నాయన్నారు. ముఖ్యంగా జగన్కు సంస్థలలో పెట్టిన పెట్టుబడులన్ని క్విడ్ ప్రోకోకు చెందినవన్న వాదనను ఆయన వ్యతిరేకించారు.
వ్యాపారపరమైన పెట్టుబడులు ఉంటాయని వివరించాడు. అంతే కాక తాను వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ది పొందలేదని కోర్టుకు వివరించాడు. కావున తన పేరును జగన్ ఆస్తుల కేసు నుంచి తొలగించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.