శ్రీశైలం ప్రమాదం : భార్యతో ఆ ఏఈ చివరి మాటలివే..., కరోనాను జయించి రాత్రే విధుల్లో చేరిన మరో ఏఈ....
శ్రీశైలం పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాద ఘటన 9 మంది ఉద్యోగుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల్లో ఒక డీఈఈ, ఆరుగురు ఏఈలు, ఇద్దరు అమర్ రాజ కంపెనీ ఉద్యోగులు ఉన్నారు. మృతి చెందిన ఏఈల్లో ఒకరైన ఏఈ వెంకట్రావు 20 రోజుల క్రితమే ఇక్కడ విధుల్లో చేరారు. మరో ఏఈ మోహన్... ఇక చావు నుంచి తప్పించుకోలేనని గుర్తించి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. మోహన్ చివరి మాటలను గుర్తుచేసుకుంటూ కుటుంబం బోరున విలపిస్తోంది. మరో ఏఈ ఇటీవలే కరోనాను జయించి గురువారం(అగస్టు 20) రాత్రే విధుల్లో చేరి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు... శ్రీశైలం పవర్ ప్లాంట్లో రాత్రి అసలేం జరిగింది...
అవే చివరి మాటలు....
ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో ఏఈ వెంకట్రావు,అమరరాజ ఉద్యోగులు పనిచేస్తున్న చోటే కుప్పకూలిపోయారు. సహోద్యోగుల్లో తన కళ్లముందే మంటల్లో కాలిపోతున్న సంఘటన చూసి తనకూ చావు తప్పదని మోహన్కు అర్థమైంది. దీంతో చివరి క్షణాల్లో ఎలాగైనా తన కుటుంబ సభ్యులతో ఒకసారి మాట్లాడాలని ఇంటికి ఫోన్ చేశారు. భార్యతో మాట్లాడిన ఆయన... 'నా చుట్టూ మంటలు వ్యాపించాయి.. 10 నిమిషాల్లో చనిపోవచ్చు.. నువ్వూ,పిల్లలను జాగ్రత్త..' అని చెప్పారు. అంతే... ఆ రెండు ముక్కలే కుటుంబ సభ్యులకు మోహన్ నుంచి వినిపించిన చివరి మాటలయ్యాయి. ఆ మాటలను గుర్తుచేసుకుంటూ ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
కరోనాను జయించి రాత్రే విధుల్లోకి...
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మరో ఏఈ ధరావత్ సుందర్ (35) ఇటీవల కరోనా బారినపడటంతో... సూర్యాపేటలోని చివ్వెంల స్వగ్రామానికి వెళ్లాడు. బుధవారం(అగస్టు 19) వరకు అక్కడే హోం ఐసోలేషన్లో ఉండి కోలుకున్న ఆయన.... గురువారమే విధుల్లో చేరాడు. విధుల్లో చేరిన రోజే పవర్ ప్లాంట్లో ప్రమాదం జరిగి ప్రాణాలు విడిచాడు. సుందర్కు భార్య ప్రమీల, ఇద్దరు కూతుళ్లు మానస్వి, నిహస్వి ఉన్నారు. ఆయన తండ్రి కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నారు. సుందర్ మరణ వార్త తెలిసి ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
9 మంది మృతి...
900 మెగావాట్ల సామర్థ్యం కలిగిన శ్రీశైలం పవర్ ప్లాంట్లో గురువారం రాత్రి 10.30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ కమ్ముకుపోయింది. ప్రమాద సమయంలో మొత్తం 17 మంది ప్లాంట్లో ఉన్నారు. వీరిలో 8 మంది ఎలాగోలా ఎస్కేప్ టన్నెల్స్ నుంచి బయటపడ్డారు. కానీ మిగతా 9 మంది మాత్రమే అందులోనే చిక్కుకుపోయి మృతి చెందారు. మృతుల్లో డీఈ శ్రీనివాస్ గౌడ్, ఏఈలు వెంకట్ రావు, మోహన్ కుమార్, ఉజ్మ ఫాతిమా, సుందర్, ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, జూనియర్ అటెండెంట్ కిరణ్, హైదరాబాద్ అమరరాజా బ్యాటరీ కంపెనీ ఉద్యోగులు వినేష్ కుమార్, మహేష్ కుమార్ ఉన్నారు.
Recommended Video
టన్నెల్స్లో నిండిన పొగ...
ప్లాంటులోని మూడు ఎస్కేప్ టన్నెల్స్ దట్టమైన పొగతో నిండిపోవడంతో చాలాసేపటివరకూ లోపలికి వెళ్లడం సాధ్యపడలేదు. సింగరేణి,ఎన్డీఆర్ఎఫ్,స్టేట్ ఫైర్ సర్వీస్ సిబ్బంది చాలాసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే అందులో చిక్కుకుపోయిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు.