శ్రీశైలం ఘోర విషాదం: భయపడ్డట్లే - ఆరుగురి మృతదేహాలు లభ్యం - చాన్స్ ఉందా? కేసీఆర్ కీలక ఆదేశాలు
ఆ కుటుంబాల మొరను మల్లన ఆలకించలేదేమో.. ఏ వార్తయితే వినకూడదని రాత్రి నుంచి భయపడుతున్నారో అదే జరిగింది.. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం ఘటన పెను విషాదంగా మారింది. ప్లాంటు లోపలే చుక్కుపోయిన 9 మంది సిబ్బందిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత చాలా గంటలకుగానీ పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చి, రెస్క్యూ టీమ్ లోపలికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు.
ఒకటి తర్వాత మరోటి..
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని శ్రీశైలం ఎగమగట్టు విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం తర్వాత.. డీఈ శ్రీనివాస్, ఏఈలు సుందర్, వెంకట్రావు, ఫాతిమా, మోహన్ కుమార్, ఫ్లాంట్ అటెండెంట్ రాంబాబు, జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్తో పాటు ఆమ్రాన్ కంపెనీకి చెందిన వినేష్, మహేష్ లోపలే చిక్కుకున్న విషయం తెలిసిందే. మంటల్ని అదుపు చేసిన తర్వాత లోపలికి ప్రవేశించిన రెస్క్యూ టీమ్ కు ఒకటి తర్వాత ఒకటిగా మృతదేమాలు కనిపించాయి. ఇప్పటిదాకా ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు.
నాటకీయ పరిణామాలు..
ప్లాంటు లోపల చిక్కుకుపోయిన సిబ్బందిని వెతికేందుకు మొత్తం 35 మందితో కూడిన రెస్క్యూ టీమ్ గాలింపు చేపట్టింది. ముందుగా రెండో, మూడో ఫ్లోర్ అంతటా గాలించినా ఉద్యోగుల ఆచూకీ లభించలేదు. ఆ తర్వాత నాలుగు, ఐదో ఫ్లోర్లలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ విపరీతమైన వేడి, పొగ ఉండడంతో వీలు కాలేదు. దీంతో వేడి తగ్గేవరకు ఆగి, మళ్లీ లోపలికి వెళ్లి గాలించగా ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతున్నది. ప్రమాదం జరిగిన తీరును బట్టి ఒక్కరైనా ప్రాణాలతో మిగులుతారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పాతాలగంగ వద్ద ఉన్న శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రం (తెలంగాణ జెన్కో)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 900 మెగావాట్ల సామర్థ్యంగల ఈ కేంద్రంలో ఒక్కోటి 150 మెగావాట్ల ఆరు యూనిట్లు ఉన్నాయి. మొదటి యూట్ ఓ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఆ వెంటనే పేలుడు శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. పవర్ హౌస్ లోపల దట్టమైన పొగ వ్యాపించాయి. ప్రమాద సమయంలో విద్యుత్ కేంద్రంలో 19 మంది ఉన్నారు. 10 మందిని క్షేమంగా బయటపడగా.. ఏడుగురు టీఎస్ జెన్కో ఉద్యోగులు, ఇద్దరు అమర్ రాజా కంపెనీ సిబ్బంది మాత్రం అక్కడే చిక్కుకుపోయారు.
సీఐడీ ఎంక్వైరీకి ఆదేశం..
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకున్న ప్రమాదంపై ప్రతిపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. దర్యాప్తు వెంటనే ప్రారంభించాలంటూ సీఐడీ విభాగాన్ని ఆయన ఆదేశించారు. ప్రైవేటు కంపెనీలు ప్రవేశించడానికి వీలుగా ప్రభుత్వ విద్యుత్ ప్లాంటులను ఉద్దేశపూర్వకంగా నాశనం చేయడంలో భాగంగానే కుట్రపూరితంగా ఈ ఘటన జరిగి ఉండొచ్చని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే.
Recommended Video
దుర్ఘటనపై నేతల సంతాపం
శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో సిబ్బంది చనిపోవడం బాధాకరమంటూ పలువురు నేతలు సంతాపాలు తెలిపారు. ఘటన దురదృష్టకరమని, మంటల్లో చిక్కుకొని ఏఈ సుందర్నాయక్ తో పాటు మరో ఐదుగురు చనిపోవడం బాధాకరమని, వారి మృతికి సంతాపం ప్రకటిస్తున్నానని, మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.