ఎస్సారెస్పీ భూముల సర్వేతో కొత్త రగడ..లెక్క తేల్చమన్న కేసీఆర్..రైతుల ఆందోళన
ఉత్తర తెలంగాణ వరప్రదాయని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపు భూములపై తెలంగాణా ప్రభుత్వం దృష్టిసారించింది అన్యాక్రాంతమైన భూముల లెక్కలు తేల్చే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. అయితే 40 ఏళ్ల అనంతరం భూముల సర్వే వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి..? సర్వే పేరుతో భూములు లాక్కుంటే ఉద్యమిస్తామని రైతులు చెబుతుంటే ముంపు భూముల్లో పంటలు సాగు చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా ఎస్సారెస్పీ భూముల సర్వే కొత్త రగడకు దారితీస్తోంది.
ఎస్సారెస్పీ ముంపు భూముల లెక్క తేల్చే పనిలో అధికార యంత్రాంగం
నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన జలాశయమైన శ్రీరాం సాగర్ ప్రాజెక్టు భూములపై ప్రభుత్వం నజర పెట్టింది . ముంపు గ్రామాల భూములను స్వాధీనం చేసుకునే పనిలో పడింది . ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నిజామాబాద్- నిర్మల్ జిల్లాల్లో భూసేకరణ చేసింది.నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, నందిపేట, నవీపేట మండలాల పరిధిలో 3,700 ఎకరాల భూములను సేకరించారు. అప్పుడు ఎకరానికి 800 చొప్పున యజమానులకు పరిహారం చెల్లించారు. ముంపునకు గురైన గ్రామాల రైతులకు ఇతర ప్రాంతాల్లో భూములను కేటాయించారు. మూడు మండలాల పరిధిలో 18 గ్రామాల్లో ముంపు భూములున్నాయి. అప్పుడు పరిహారం చెల్లించినా ప్రభుత్వం కొన్ని భూములను ఇప్పటికీ స్వాధీనం చేసుకోలేదు. అంతేకాదు ప్రాజెక్టు పేరుపై కూడా రిజిస్టర్ చేయలేదు.
40 ఏళ్ల తరవాత అధికారులు చేపడుతున్న సర్వేపై రైతుల ఆగ్రహం
ప్రాజెక్టు నిండిన సమయంలో ముంపు భూములలో నీళ్లు ఉండటం వల్ల భూములను అధికారులు గుర్తించలేదు. నీళ్లు లేని సమయంలో రైతులు పంటలు వేసుకుని సాగు చేస్తున్నారు . మరికొందరు కబ్జా చేసి భూ బదలాయింపు చేసుకున్నారు. ఇలా ఎస్సారెస్పీ భూమి పెద్ద సంఖ్యలో అన్యాక్రాంతం అయ్యింది. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ భూమల సర్వేకు ఆదేశించారు. దీంతో సాగునీటి- రెవెన్యూ శాఖల అధికారులు జాయింట్ సర్వే చేపట్టారు. 40 ఏళ్ల తరవాత అధికారులు చేపడుతున్న సర్వేపై ముంపు గ్రామ రైతులు మండిపడుతున్నారు. సర్వే పేరుతో భూములు లాక్కుంటే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఎస్సారెస్పీ భూములను సాగునీటి శాఖ పేరుపై మ్యూటేషన్ చేసేందుకు ఏర్పాట్లు
శ్రీరాం సాగర్ భూములు సేకరించిన అనంతరం ప్రస్తుతం ఎంత అన్యాక్రాంతం అయ్యిందో.. ప్రభుత్వం వద్ద లెక్కలు లేవు. అందుకే సర్వే నిర్వహిస్తున్న అధికారులు అన్యాక్రాంతమైన భూములను లెక్కించడంతో పాటు ఎస్సారెస్పీ భూములను సాగునీటి శాఖ పేరుపై మ్యూటేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భూములను స్వాధీనం చేసుకుని ఆ భూముల్లో ప్రాజెక్టు అవసరాలతో పాటు ఇతర అవసరాలకు వినియోగించేందుకు తెలంగాణా సర్కారు ప్రణాళికలు వేస్తోంది.
Recommended Video
రైతుల ఆందోళన .. సర్వేతో ఆధారం పోతుందని ఆవేదన
ముంపు భూముల్లో ప్లాంటేషన్ తో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో పుడ్ ప్రాసెసింగ్ సెజ్ లతో పాటు ఇతర పరిశ్రమల ఏర్పాటుకు ఈ భూములను వినియోగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం చేపట్టిన సర్వేతో.. ఎస్సారెస్పీ భూములన్నీ పక్కా అవుతాయని అధికారులు భావిస్తుంటే.. 40 ఏళ్ల తర్వాత చేపట్టిన సర్వేతో తమ ఆధారం పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో సర్వే అంశం ఇప్పుడు జిల్లాలో అగ్గిరాజేస్తోంది. మరి ఈ సర్వే భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.