పల్లీలమ్మే వ్యక్తి కూతురుకి 10/10: 9ఏళ్లకే పది పాస్
వరంగల్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో వరంగల్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన పేద గిరిజన విద్యార్థిని శృతి అద్భుత ప్రతిభ చూపింది. ప్రభుత్వ పాఠశాలలో చదివి 10కి 10 జీపీఏ పాయింట్లు సాధించి జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబర్చింది.
కేసముద్రం మండలం బడితండాకు చెందిన అజ్మీరా బిచ్చు, సుక్కి దంపతులకు కుమారుడు సందీప్, కుమార్తె సృజనలు ఉన్నారు. వారు రైలులో పల్లీలు అమ్ముతూ జీవనం గడుపుతుంటారు. పిల్లలకు మాత్రం చదివించారు. వారికి చదువులో ఎలాంటి లోటు రానీయరు.
సృజన కల్వల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8 నుండి పదో తరగతి వరకు చదువుకుంది. పేదరికం అంటే ఏమిటో తనకు తెలుసునని, ఉననత స్థానానికి చేరుకొని తనలాంటి పేదలకు సహాయం చేస్తానని శృతి చెప్పారు.
తొమ్మిదేళ్లకే డిస్టింక్షన్
తొమ్మిదేళ్ల పిల్లాడు పదో తరగతిలో డిస్టింక్షన్ సాధించాడు! హైదరాబాద్లోని కాచిగూడ డివిజన్ కుత్భిగూడకు చెందిన అశ్వినీ కుమార్, భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు అగస్త్య జైస్వాల్ (9) టెన్త్ పరీక్షల్లో 7.5పాయింట్లతో ఏ గ్రేడ్లో ఉత్తీర్ణుడయ్యాడు.
అతి చిన్న వయస్సులో టెన్త్ పూర్తిచేసి బాలురలో రికార్డు నెలకొల్పాడు. ఈ బుడతడు అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ తమ్ముడు కావడం విశేషం. ఆమె కూడా ఎనిమిదేళ్లకే టెన్త్ పూర్తిచేసి రికార్డు నెలకొల్పింది. టెన్త్ పరీక్షలకు అగస్త్యను స్పెషల్ గ్రేడ్ కింద ప్రభుత్వం అనుమతించింది. డాక్టరై పేదలకు సేవలందించడమే తన లక్ష్యమని అగస్త్య చెబుతున్నాడు.