నేడే అసెంబ్లీ రద్దు.. ఏకవ్యాఖ్య తీర్మానంతో: 50 మంది అభ్యర్థుల ప్రకటన?
Recommended Video
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేడు అసెంబ్లీని రద్దు చేయనున్నారు. ఈ మేరకు ఆయన మధ్యాహ్నం సంచలన ప్రకటన చేయనున్నారు. ఈ రోజుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాల 3 నెలల నాలుగు రోజులు. 2014 జూన్ 2వ తేదీన ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ రోజు మధ్యాహ్నం 1 గంటలకు కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు గవర్నర్ నరసింహన్ను కలిసి మంత్రిమండలి సిఫార్సును సమర్పించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన మీడియాతో మాట్లాడుతారు. మధ్యాహ్నం 12 గంటలకే మంత్రులు ప్రగతి భవన్ రావాలని తాజాగా గురువారం ఉధయం సూచన చేశారు.
అయ్యా! ఈ పార్టీలతో మావల్ల కాదు, మీరు రండి అంటున్నారు: జగన్-బాబులపై కేటీఆర్!
అధికారిక ప్రకటన లేదు కానీ
గత కొద్ది రోజులుగా తెలంగాణ అసెంబ్లీ రద్దవుతుందని ప్రచారం సాగుతూనే ఉంది. కానీ దీనిపై కేసీఆర్ నుంచి లేదా ఇతర పార్టీ నేతల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. టీఆర్ఎస్ నేతల మాటలు మాత్రం అసెంబ్లీ రద్దు చేస్తారనేలానే ఉన్నాయి. కేసీఆర్కు లక్కీ నెంబర్ 6. కాబట్టి సెప్టెంబర్ 6న రద్దు చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
ఏకవ్యాఖ్య తీర్మానంతో సభ రద్దు
ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం 1 గంటలకు కేబినెట్ ఏకవాక్య తీర్మానం ద్వారా శాసనసభ రద్దుకు సిఫార్సు చేయనుంది. మంత్రివర్గ సమావేశ అజెండాలో శాసనసభ రద్దుకు సంబంధించిన అంశం మాత్రమే ఉండనుందని తెలుస్తోంది. తొలుత ఉదయం కేబినెట్ ఉంటుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మధ్యాహ్నం ఉంటుందని చెప్పారు.
దాదాపు యాభై మంది వరకు అభ్యర్థుల ప్రకటన
గురువారం ఉదయం ఆరుగంటలకు అందుబాటులో ఉండాలని మంత్రులకు కేసీఆర్ సూచనలు చేశారు. కాగా, ఆయన మధ్యాహ్నం మీడియాతో మాట్లాడే సమయంలోనే దాదాపు యాభై మంది వరకు అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటిస్తారని అంటున్నారు. కేబినెట్ ఆమోదం కోసం వివిధ శాఖల నుంచి భారీగా వచ్చిన ప్రతిపాదనలను పక్కన పెట్టారని తెలుస్తోంది.
అసెంబ్లీ రద్దుపై చర్చ
కాగా, సీఎం బుధవారం సాయంత్రం ఫాంహౌస్ నుంచి ప్రగతి భవన్ చేరుకొని అధికారులతో సుధీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కె జోషి, సలహాదారు రాజీవ్ శర్మ, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, జీఏడీ రాజకీయ కార్యదర్శి అధర్ సిన్హా, సీఎంవో అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ రద్దు, అనంతరం తీసుకోవాల్సిన చర్యల గురించి వివరంగా చర్చించారని తెలుస్తోంది. దీంతోపాటు ఉద్యోగులు, వివిధ శాఖలకు సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడారు.