ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు: డిసిపి, తొక్కిసలాట.. లడ్డూ పంపిణీ నిలిపివేత
హైదరాబాద్: ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఖైరతాబాద్ గణేష్ లడ్డూ ప్రసాదం పంపిణీలో గందరగోళం ఏర్పడటం వల్ల పంపిణీని నిలిపివేయించినట్లు ఆయన చెప్పారు.
నిమజ్జనం తర్వాత కొంత గడువు ఇచ్చి ప్రసాదం పంపిణీ చేయడం వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతున్నట్లు చెప్పారు. లడ్డూ ప్రసాదం పంపిణీకి నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం, ఏకపక్షంగా కొందరికే కిలోల కొద్ది పంపిణీ చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
లడ్డూ పంపిణీ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. అప్పటికే పలుమార్లు తోపులాట జరిగింది. దీంతో, డీసీపీ కమలాసన్ రెడ్డి నిర్వాహకులతో మాట్లాడి లడ్డూ ప్రసాదం పంపిణీని నిలిపివేయించారు. మిగిలిన ప్రసాదాన్ని నగరంలోని పలు దేవాలయాలకు తరలించి భక్తులకు అందేలా చేస్తామని కమలాసన్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడు నుంచి లడ్డూ ప్రసాదాన్ని వినాయక చవితి నుంచే రోజు భక్తులకు పంపిణీ జరిగేలా ఒప్పిస్తామన్నారు.
తొక్కిసలాట
లడ్డూ ప్రసాదాన్ని ఉదయం భక్తులకు పంపిణీ చేశారు. లడ్డూ ప్రసాదం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో పంపిణీ వద్ద తోపులాట జరిగింది. భక్తులను అదుపు చేయడం పోలీసులకు కష్టతరంగా మారింది. భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో బారికేడ్లు ధ్వంసమై పలువురికి గాయాలయ్యాయి.
తోపులాటలో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. లడ్డూ ప్రసాదం కోసం వేలసంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పోలీసు బందోబస్తు సరిపోకపోవడంతోనే తోపులాట జరిగిందని పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీపీ సురేందర్ రెడ్డి, డీసీపీ కమలాసన్ రెడ్డి అదనపు బందోబస్తుతో ఖైరతాబాద్ చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. లడ్డూ పంపిణీని నిలిపేశారు.