కాళేశ్వరం ప్రమాదం: అసలు కథ ఇదీ.., ఏమిటది?
రాష్ట్రమంతటా సస్యశ్యామలం చేయడానికి కంకణబద్ధురాలైన తెలంగాణ సర్కార్.. అందుకోసం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలో మాత్రం భద్రతను గాలికొదిలేసిందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
హైదరాబాద్: రాష్ట్రమంతటా సస్యశ్యామలం చేయడానికి కంకణబద్ధురాలైన తెలంగాణ సర్కార్.. అందుకోసం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలో మాత్రం భద్రతను గాలికొదిలేసిందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజుల క్రితం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని పదవ ప్యాకేజీలో జరిగిన ప్రమాదం జరిగిన తీరు దీనికి నిదర్శనంగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
అడుగడుగునా నిర్లక్ష్యం, పర్యవేక్షణా లోపం కనిపిస్తున్నాయి. కాంట్రాక్టు పొందిన సంస్థ నుంచి వివిధ పనులను అనధికారికంగా అందుకున్న సంస్థలు సరైన భద్రతా ప్రమాణాలు పాటించనందునే ఈ ప్రమాదం జరిగిందన్న విమర్శలు ఉన్నాయి.
రాజన్న- సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో నిర్మిస్తున్న పవర్హౌస్ సొరంగంలో బండ కూలిన ఘటనలో ఏడుగురు కార్మికుల మృతి ఘటన రాష్ట్ర వ్యాప్త సంచలనం కలిగించింది. ఇందులోనూ రూ. 2,750 కోట్లు విలువ చేసే పదవ ప్యాకేజీ పనులను దక్కించుకున్న హెచ్సీసీ కంపెనీ ఈ ప్యాకేజీలోని ఐదు పనులను సబ్ కాంట్రాక్టర్లకే అప్పగించటం చర్చనీయాంశమైంది.
సర్కార్కు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న వైనం
వీటిలో సర్జ్పూల్, పంప్హౌస్, రిజర్వాయర్ పనులను ప్రతిమ కంపెనీకి, ఆప్రోస్ కాల్వ, సొరంగం పనులను కేఎస్ఆర్ కంపెనీకి హెచ్సీసీ కంపెనీ అనధికారికంగా అప్పగించింది. నీటిపారుదల శాఖ నుంచి ఎటువంటి అనుమతులూ తీసుకోకుండా ఈ పనులను అప్పగించినట్లు ఉన్నతాధికారులు చెప్పటం ఆశ్చర్యం కలిగిస్తున్నదని ఈ ప్రాంత వాసులు అంటున్నారు. సబ్కాంట్రాక్టర్ల వ్యవహారం నీటిపారుదల శాఖలోని ఉన్నతాధికారులకు, ప్రభుత్వ పెద్దలకూ తెలిసినా తెలియనట్టు నటించడం విచిత్రంగా ఉన్నదని చెప్తున్నారు.
కొరవడిన ఇంజినీర్ల పర్యవేక్షణ
సివిల్ పనుల్లో అతి కీలక టన్నెల్ పనుల విషయంలో గత అనుభవం, సాంకేతిక సామర్ధ్యం పరిగణలోకి తీసుకున్న తర్వాతే ముందుగా టెక్నికల్ బిడ్లు ఆమోదిస్తారు. ఇంత ముఖ్యమైన పనులను టెండర్ దక్కించుకున్న వారు చేయకుండా సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్లే తిప్పాపూర్ ప్రమాదాల వంటి ఘటనలు జరుగుతున్నాయని నీటిపారుదల శాఖ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. తిప్పాపూర్ పవర్హౌస్లో చేపట్టిన టన్నెల్ (డ్రాఫ్ట్ ట్యూబ్) పనుల నిర్మాణం సాంకేతిక నైపుణ్యం కలిగిన కంపెనీ ఇంజినీర్లతోపాటు నీటి పారుదల శాఖ ఇంజినీర్ల ప్రత్యక్ష పర్యవేక్షణ కూడా కరువైందని తెలుస్తున్నది.
గతంలో ఇలా టన్నెల్ ప్రమాదాలు
పైకప్పు ప్రాంతంలోని బండలకు బ్లాస్టింగ్ కోసం రంధ్రాలు చేసిన ప్రదేశంలో వలస కూలీలతోపాటు వారితో ఉన్న పర్యవేక్షకుడు మాత్రమే ఉన్నారు. ఈ రంధ్రాల నుంచే గ్యాస్ వచ్చి ఎయిర్ బ్లాస్టింగ్ జరిగిందని వారు అంటున్నారు. గతంలో చిన్న చిన్న సంఘటనలు జరిగినా ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందని ముందుగా ఊహించలేదని ఘటనాస్థలంలోని ఇతర కార్మికులు తెలిపారు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా గతంలో వివిధ టన్నెళ్లలో ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందిన తర్వాత కూడా కాంట్రాక్టు కంపెనీలు, ఇంజినీర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. శ్రీశైలం పవర్హౌస్ టన్నెల్ పనుల్లోనూ, దేవాదుల ఎత్తిపోతల పథకంలో టన్నెల్ పనుల్లోనూ ఇటువంటి ఘటనలు జరిగాయి.
జాగ్రత్తలు తీసుకోని కాంట్రాక్టు సంస్థ
టన్నెల్ పనులు చేపట్టే కంపెనీల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇంజినీర్లు ఉండాలని, ముందుగా జియో మ్యాపింగ్తో అక్కడి భౌగోళిక పరిస్థితి అంచనా వేసిన తర్వాతే పనులు చేపట్టాలని కొందరు విశ్రాంత ఇంజినీర్లు తెలిపారు. ప్రధానంగా భూగర్భంలో ప్రమాదకర గ్యాస్ లీక్ కావటం, ఆకస్మికంగా నీరు రావడం, పైకప్పు కూలడం వంటి సంఘటనలు జరుగుతాయని ఇంజినీర్లకు తెలుసునని, అటువంటి ప్రమాదకర ప్రదేశంలో పనులు చేసే సందర్భంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. తిప్పాపూర్ ప్రమాదాన్ని పరిశీలిస్తే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని స్పష్టమవుతున్నది. ఈ పనులను ఇటీవల పరిశీలించిన కొందరు భూగర్భ నిపుణులు సంబంధిత కంపెనీ ఇంజీనీర్లను ముందే హెచ్చరించినట్లు ఒక కార్మికుడు తెలిపాడు.
మైనింగ్ ఇంజినీరింగ్ సామర్థ్యం ఇలా తప్పనిసరి
మంగళవారం ఈ పని ప్రదేశాన్ని పరిశీలించిన సాంకేతిక బృందం కూడా ముందస్తు హెచ్చరించినట్లు తెలిసింది. ఈ ప్రదేశంలో డ్రిల్ చేసి రాడ్లను వేసి సిమెంట్తో దానిని పటిష్ట పరచాలని వారు హెచ్చరించినా దీన్ని పట్టించుకోలేదని సూపర్వైజర్ తెలిపాడు. సాంకేతిక నిపుణులు అక్కడ ఉన్నప్పుడే పెచ్చులూడి పడటాన్ని కూడా వారు గమనించారని తెలిపాడు. భూగర్భంలో టన్నెల్ వంటి పనులను చేసే కంపెనీకి మైనింగ్ ఇంజినీరింగ్ సామర్ధ్యం కూడా ఉండాలని అవసరమైనప్పుడు సింగరేణి వంటి సంస్థల సహకారం కూడా తీసుకోవాలని మరికొందరు సీనియర్ ఇంజినీర్లు భావిస్తున్నారు. టన్నెల్ పనుల్లో పూర్తిస్థాయి అనుభవం లేని ప్రతిమ కంపెనీ ఎటువంటి ముందస్తుజాగ్రత్తలు తీసుకోలేదని, పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన నీటిపారుదల ఇంజినీర్లు ఉదాసీనంగా వ్యవహిస్తున్నారని కార్మికులు ఆరోపించారు.
పోలీస్ బందోబస్తు ఇలా
తిప్పాపూర్లోని పదవ ప్యాకేజీలో జరిగిన విషాద సంఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందటంతోపని ప్రదేశంలో ఉన్న కార్మిక శిబిరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సంఘటన తర్వాత పనులు నిలిపివేయటంతో గురువారం వారి శిబిరాల్లోనే ఉండిపోయారు. కాగా, కొందరు కార్మికులు భయంతో ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నారని ఒక కార్మికుడు తెలిపాడు. ఘటన తర్వాత కార్మికుల మృత దేహాలను గుట్టుచప్పుడు కాకుండా తరలించారని కార్మికులు తెలిపారు. మృత దేహాలను ఇతర కార్మికులు కూడా చూడకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారని వారు ఆరోపించారు.
లేబర్కు వేతనాల చెల్లింపు ఇలా
మృత దేహాలకు కరీంనగర్ ప్రభుత్వ వైద్యశాలలో పోస్ట్మార్టమ్ చేసిన తర్వాత వెంటనే ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు పంపేశారని, వారి కుటుంబాలకు ఏమి చెబుతారో తెలియదని అన్నారు. ప్రతిమ కంపెనీ ఆధ్వర్యంలోని మూడు శిబిరాల్లో దాదాపు వెయ్యి మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ శిబిరాల్లో ఆరకొర వసతులతో కాలం గడుపుతున్నారు. వీరంతా జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, అసోం, ఏపీ రాష్ట్రాల వారే. కేరళకు చెందిన ఒక లేబర్ కాంట్రాక్టర్ ప్రతిమ కంపెనీ కోసం తమను ఇక్కడికి తీసుకొచ్చాడని వారు తెలిపారు. పని జరిగిన రోజుల్లో రోజుకు రూ. 350 చెల్లిస్తారని చెప్పారు. తమకు కంపెనీ నేరుగా జీతాలు ఇవ్వటం లేదని కాంట్రాక్టరే ప్రతినెలా జీతం చెల్లిస్తున్నాడని అన్నారు. దీనికి ప్రతిఫలంగా అతనికి కమిషన్ అందుతుందన్నారు. వలస కార్మికులతో నిర్ణీత పనిగంటల కన్నా ఎక్కువసేపు పనిచేయించుకోవటం అక్కడ సర్వసాధారణమని ఆ ప్రాంత వాసులు తెలిపారు.