హ్యాట్సాఫ్ వరుణ్..పీకల్లోతు నీళ్లలో 10ఏళ్ల బాలుడి నిరసన -అందరినీ కదిలించాడు -రైతులంటే సినిమా షో కాదు
కొద్ది గంటలుగా ఈ బాలుడి ఫొటో, వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.. కాగితం పడవలతో వాన నీటిలో ఆడుకోకునే వయసులో అతను.. అధిక వర్షాల వల్ల రైతులు పడుతోన్న గోసను సమాజం దృష్టికి తీసుకొచ్చాడు.. రైతుల్ని ఎవరూ పట్టించుకోరా? అని ప్రభుత్వాన్ని నిలదీశాడు.. తన తాత నాటు వేసిన వరి పొలం వానకు మునగడంతో ఆ నీళ్లలోనే మెడదాకా కూర్చుని.. దండంపెడుతూ పెడుతూ రైతుల అవస్థల్ని వివరించే ప్రయత్నం చేశాడు.. అతని ప్రయత్నం ఫలించింది.. ఉన్నతాధికారులు దిగొచ్చారు.. ప్రశ్నించడాన్ని నేరంగా ప్రభుత్వాలు పరిగణిస్తోన్న ప్రస్తుత సందర్భంలో ఈ పదేళ్ల బాలుడికి జనం హ్యాట్సాఫ్ చెబుతున్నారు..
ముఖ్యమంత్రివా? భూముల బ్రోకర్వా? - కేసీఆర్పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఫైర్
అసలేమైందంటే..
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అర్రూర్ గ్రామానికి చెందిన రైతు దొంతి అయిలయ్య అనే వృద్ధరైతు తన ఆరు ఎకరాల పొలంలో వరి పంట వేశాడు. అందుకోసం దాదాపు 1.5 ఖర్చయింది. ఇటీవల కురిసన భారీ వర్షాలకు.. పొట్టదశలో ఉన్న పంటంతా నీట మునిగింది. ఆ నీళ్లను బయటికి తోడేసే వీలు లేకుండా బోరు, మోటరు, స్టార్టర్ కూడా మునిగిపోయాయి. కిందికి వెళ్లే దారిలేక ఆ వరద నీరు పొలంలోనే రోజులపాటు నిలిచిపోయింది. పంటపోయి, అప్పులు మిగలడంతో అయిలయ్య తీవ్ర ఆవేదన చెందాడు. తాత బాధ చూడలేక అయిలయ్య మనుమడైన 10 ఏళ్ల వరుణ్ వినూత్న ఆలోచన చేశాడు..
డబ్బులొద్దు.. తూము తెరవండి..
అధిక వర్షాల కారణంగా పంట నష్టపోవడం ఒకఎత్తైయితే, వరద నీరు పొలంలోనే నిలిచిపోవడం వరుణ్ కుటుంబాన్ని మరింత బాధపెట్టింది. అర్రూర్ గ్రామంలో వాళ్ల పొలం అంతా కాండ్లబావికుంట ఎగువ భాగంలోని శిఖం పట్టా. కుంట నిండితే అదనపు నీరు బయటకు పొర్లేందుకు అక్కడ అలుగు ఏర్పాటు లేదు. తూము ద్వారానే వదలాల్సి ఉంటుంది. దీంతో కుంట నిండినప్పుడల్లా అయిలయ్య పొలం నీళ్లపాలవుతోంది. తాత ఇబ్బందులను సమాజం దృష్టికి తేవాలనుకున్న వరుణ్ తమ పొలంలో చేరిన నీళ్లలో కూర్చుని.. మేనమేమ సాయంతో ఓ వీడియో రూపొందించాడు. మాకు డబ్బులొద్దు.. ఈ నీళ్లు బయటికి పోయేలా తూములు తెరవండి.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండంటూ వరుణ్ అధికారుల్ని వేడుకున్న తీరు అందరినీ ఆలోచింపజేసింది.
తిరుమలలో డిక్లరేషన్ ఎందుకు? ఇతర ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో లేదుగా: మంత్రి కొడాలి నాని సంచలనం
రైతంటే సినిమాలో చూపించినట్లు..
‘‘టీవీ ష్లోల్లో.. సినిమాల్లో చూపించినట్లుగా రైతులు ఉండరు. మా పొలం మునిగిపోయినందుకు నష్టపరిహారం అడగట్లేదు.. కాండ్లబావికుంట తూము సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారిని వేడుకుంటున్నాను. రైతు పండించిన అన్నమే తింటూ రైతుల కష్టాలు ఎందుకు పట్టించుకోరు? కంపెనీలు చేసే వేల కోట్ల అప్పులు తీరుస్తున్న ప్రభుత్వం.. రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోదు?'' అంటూ ఒకటిన్నర నిమిషాల విడియోల వరుణ్ సూటి ప్రశ్నలు సంధించాడు. రైతు సమస్యలపై వరుణ్ రూపొందించిన వీడియో వైరల్ గా మారడమేకాదు, రాజకీయంగానూ చర్చనీయాంశమైంది.
అరెస్టు చేసినంత తేలిక కాదు..
రైతు అయిలయ్య మనుమడు 10 ఏళ్ల వరుణ్ తమ కష్టాలను వివరిస్తూ చేసిన వీడియోను ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు హైలైట్ చేశారు. ‘‘ముఖ్యమంత్రిగారూ.. ఈ 10ఏళ్ల పిల్లాడికి సమాధానం చెప్పడం.. హౌజ్ అరెస్టు చేసినంత తేలికకాదు..'' అని ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో వైరలైన ఈ వీడియోపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ఎట్టకేలకు స్పందించారు. వరుణ్ చెప్పిన రైతు సమస్యపై విచారణ జరపాలని సిబ్బందిని ఆదేశించారు. చివరికి ప్రభుత్వ యంత్రాంగం కదిలొచ్చి.. కాండ్లబావికుంట తూములోంచి నీళ్లు వెళ్లిపోయే ఏర్పాటు చేయడంతో వరుణ్ కుటుంబం ఇబ్బందులు తాత్కాలికంగా తొలగిపోయాయి.