ఐటీ చీకట్లు: టెక్కీల నెత్తిన పిడుగు..లక్షల్లో డబ్బు కట్టించుకుని 'దివాళా'!
హైదరాబాద్ హైటెక్ సిటీ పరిధిలోని కొండాపూర్ ఏక్తా టవర్ లో ఈ అవెన్యూ కంపెనీ ఉంది. జగదీశ్ అనే వ్యక్తి కొద్ది నెలల క్రితం దీన్ని నెలకొల్పాడు.
హైదరాబాద్: ఐటీ వెలుగులను చీకట్లు ఆవరిస్తున్నాయి. ఓవైపు ఉద్యోగాల కోత.. మరోవైపు బోర్డు తిప్పేస్తున్న కంపెనీలతో టెక్కీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కేవలం ఐటీ ఉద్యోగాల పట్ల యువతకు ఉన్న మోజును క్యాష్ చేసుకునేందుకు కొన్ని డొల్ల కంపెనీలు సైతం పుట్టుకొస్తున్నాయి.
రోడ్డున పడ్డ 250మంది టెక్కీలు: బోర్డు తిప్పేసిన 4కంపెనీలు, దిక్కులేని స్థితిలో!..
వీటి మాయ మర్మాలను గుర్తించని అమాయకులు.. లక్షల్లో డబ్బులు కట్టి మరీ జాబ్స్ కొనుక్కుంటున్నారు. తీరా సదరు కంపెనీలు బోర్డు తిప్పేశాక ఏం చేయాలో తెలియక పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఓ కంపెనీ చేసిన నిర్వాకానికి చాలామంది టెక్కీలు రోడ్డునపడ్డారు.
అవెన్యూ మాయ:
ఆ సంస్థ పేరు అవెన్యూ ఐటీ కంపెనీ. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. ఆకర్షణీయమైన జీతం ఆఫర్ చేస్తుండటంతో.. చాలామంది అవెన్యూ సంస్థను గుడ్డిగా నమ్మారు. తొలుత ఇంటర్వ్యూలు, ఆపై ఆఫర్ లెటర్స్.. ఇక్కడిదాకా అంతా సాఫీగానే సాగుతున్నట్లు కనిపించింది. కానీ రెండో నెల గడిచాక గానీ ఉద్యోగులకు అసలు సీన్ అర్థం కాలేదు.
నో సాలరీస్:
జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మొదటి నెల మాత్రమే ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందాయి. ఆ తర్వాత నుంచి నో సాలరీస్. గట్టిగా నిలదీస్తే.. యాజమాన్యం చేతులెత్తేసింది. పైగా ఆఫీసుకు తాళాలేసేయడంతో.. ఉద్యోగులకు ఏమి అంతు పట్టలేదు. ఫోన్ చేసి అడిగితే.. ప్రాజెక్టులు లేవని నిర్లక్ష్య సమాధానం.
కొండాపూర్ లోని ఏక్తా టవర్:
హైదరాబాద్ హైటెక్ సిటీ పరిధిలోని కొండాపూర్ ఏక్తా టవర్ లో ఈ అవెన్యూ కంపెనీ ఉంది. జగదీశ్ అనే వ్యక్తి కొద్ది నెలల క్రితం దీన్ని నెలకొల్పాడు. నిరుద్యోగ యువతీ యువకులను ఆకర్షించి సుమారు 70మంది చేత తలా రూ.1లక్ష నుంచి లక్షన్నర వరకు కట్టించుకున్నాడు. అనంతరం మైండ్ స్పేస్ లోని స్పేసియస్ టవర్స్ లో ఇంటర్వ్యూలు నిర్వహించి.. ఆఫర్ లెటర్స్ కూడా ఇచ్చారు. నెల రోజులు అంతా సక్రమంగానే ఉన్నా.. ఆపై కంపెనీ దివాళా తీయడంతో.. ఉద్యోగులంతా పోలీసులను ఆశ్రయించారు.
పోలీసుల అదుపులో వీరు?:
ఈ వ్యవహారంపై నల్గొండకు చెందిన మాడ్గుల గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ సంస్థ హెచ్ఆర్ మేనేజర్ విజయవాడకు చెందిన కోతూరి కార్తీక్ (26), కంప్యూటర్స్ మెయింటెనెన్స్ చేసే ఖమ్మం జిల్లాకు చెందిన వల్లభరెడ్డి ఫణీంద్ర కుమార్ (28) లను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన సంస్థ యజమాని జగదీశ్ తో పాటు మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.