కేసీఆర్ను నమ్మలేం...రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వద్దు: బీజేపీ నివేదిక
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వార్త జోరందుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్లో ముందస్తు ఎన్నికలపై మంత్రులతో చర్చించినట్లు సమాచారం. అయితే మంత్రులు మాత్రం కేసీఆర్ నిర్ణయంపై నో చెప్పినట్లు తెలుస్తోంది. ముందస్తుకు వెళ్లకపోవడమే మంచిదని మెజార్టీ మంత్రులు చెప్పినట్లు సమాచారం. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సివస్తే ఈ ఏడాది డిసెంబరులో జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాలతో ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావించారట.
కేసీఆర్ ఆలోచనకు బ్రేక్ వేయాలని కమలనాథులు భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లకుండా బీజేపీ తమ వ్యూహాలను సిద్దం చేసుకుంటోంది. ముందస్తు ఎన్నికలకు వెళితే టీఆర్ఎస్, కాంగ్రెస్లకు లాభిస్తుందని బీజేపీకి ఒరిగేది ఏమీ లేదని కమలం పార్టీ తమ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు కేసీఆర్ను నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ మాట ప్రకారమే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళితే... వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆయన బీజేపీతో కలిసి వస్తారనే గ్యారంటీ లేదని రాష్ట్ర బీజేపీ పెద్దలు బీజేపీ హైకమాండ్కు తెలియజేశారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెప్పిన గులాబీ బాస్ ఆ తర్వాత తన దారి తాను చూసుకుని మాట తప్పారని కమలనాథులు గుర్తు చేశారు.
కేసీఆర్ ఆలోచన, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీకి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలకు రాష్ట్ర కమలం పార్టీ పెద్దలు ఓ నివేదికను సమర్పించారు. ఇందులో ముందస్తు ఎన్నికలకు వెళితే తదనంతరం ఎదురయ్యే పరిణామాలను అందులో వివరించారు. అంతేకాదు కేసీఆర్ మాటలు హామీలు నీటి మూటలేనని వాటిని నమ్మితే నిండా మునిగినట్లేనని రాష్ట్ర బీజేపీ నేతలు మోడీ, అమిత్షాలకు తెలిపారు.