కమిషన్ కోసం కక్కుర్తి : ‘భగీరథ’పై ఇలా గణాంకశాఖ మోజు
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మక పథకం ‘మిషన్ భగీరథ’. ఇంటింటికి తాగునీటి సరఫరాకు చేపట్టిన ఈ పథకంలో తొలిదశ పనులు త్వరలో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మక పథకం 'మిషన్ భగీరథ'. ఇంటింటికి తాగునీటి సరఫరాకు చేపట్టిన ఈ పథకంలో తొలిదశ పనులు త్వరలో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. అదే సమయంలో అవినీతికి తావు లేకుండా పథకాలు అమలుచేస్తున్నామని ఆయన ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నది. కానీ ఈ పథకం అమలులో గణాంకశాఖలో 'పే అండ్ అక్కౌంట్స్' శాఖ అధికారులు (పీఏఓ) మాత్రం తమకు అమ్యామ్యా చెల్లించకుంటే మాత్రం రోజుల తరబడి బిల్లుల పెండింగ్లో పెడుతున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రత్యేకించి మిషన్ భగీరథ ఇంట్రా విలేజ్ నెట్వర్క్ పనుల్లో భారీ అవినీతి జరుగుతున్నది. చేసిన పనులకు బిల్లుల చెల్లింపుల్లో గణాంక శాఖ పీఏవోలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రతి ఫైలుకు కనీసం నాలుగు నుంచి ఐదు శాతం 'అమ్యామ్యా' ముట్టజెప్పకపోతే బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదనే చెప్తున్నారు.
ఇది ఒక వైపు కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడుతుంటే, మరోవైపు భగీరథ కార్పొరేషన్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తలనొప్పిగా మారింది. 2018 జూన్ నాటికి ఇంట్రా విలేజ్ నెట్వర్క్ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు నిర్వహణ కోసం భారీ సామర్థ్యంతో కూడిన విద్యుత్ మోటార్ పంపుసెట్లు త్వరలో రాష్ట్రానికి రానున్నాయి. ఈమేరకు భగీరథ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలకు ప్రభుత్వం ఇప్పటికే పంపుసెట్ల కోసం ఆర్డర్లు ఇచ్చింది.
20 వేల గ్రామాల్లో 15 వేల పనులు
రాష్ట్రంలో భగీరథ ఇంట్రా పనులు దాదాపు 20,404 గ్రామాల్లో చేపట్టారు. సుమారు 4056 ప్యాకేజీలుగావిభజించి చేపట్టారు. ఇంట్రా పనుల్లో పల్లెల్లో వీధుల గుండా కొత్తగా పైపులైన్లు వేయడం, ఇంటింటికి నల్లాలు బిగించాల్సి ఉంటుంది. ఇలా దాదాపు 15,916 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణంతోపాటు 2250 పైపు లైన్లు వేయాలి. భగీరథ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.47 వేలకోట్లు ఖర్చు చేస్తున్నది. ఇంట్రా పనుల కోసం రూ.5500 కోట్లు కేటాయించింది. ఇదిలా ఉండగా ఈ పనులు చేపట్టేందుకు స్థానిక కాంట్రాక్టర్లు దొరకక మహారాష్ట్ర, హర్యానా, ముంబయి, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి రప్పించారు. టెండర్ల ద్వారా పనులు చేయిస్తే ఆలస్యమని, ప్రపంచ బ్యాంకు షాపింగ్ మెథడ్ పద్ధతిలో పనులు అప్పగించారు. కాంట్రాక్టర్ స్థాయిని బట్టి రూ. 15 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు పనులు ఇచ్చారు.
ప్రతి బిల్లుకూ కమిషన్ తప్పనిసరి
పూర్తి చేసిన పనులకు బిల్లులు చెల్లింపుల్లో గణాంక శాఖ పీఏవోలు జాప్యం చేస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల కాంట్రాక్టర్లు ఒకింత అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ప్రతి బిల్లుకు కమీషన్ చెల్లింపు తప్పదని వర్క్ ఏజెన్సీలు అంటున్నాయి. దీంతో గ్రామాల్లో ఉండే చిన్న కాంట్రాక్టర్లు, వర్క్ ఏజెన్సీలు ఇబ్బంది పడుతున్నాయి. దీంతో డబ్బులు ఇవ్వనిదే ఫైలు ముట్టుకోవడం లేదు. రోజుల తరబడి బిల్లుల రాకపోవడంతో వర్క్ ఏజెన్సీలు నిరాశకు గురవుతున్నాయి. ఆందోళన చెందుతున్నాయి. పదే పదే పీఏవోల చుట్టూ తిరిగినా ఫలితం ఉండటం లేదని అంటున్న కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. కాగా పీఏవోల వైఖరితో పనులు నెమ్మదించే ప్రమాదం కనిపిస్తున్నది. దాదాపు 30 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్టు సమాచారం.
విధులకే పాలమూరు పీఏవో దూరం
మహబూబ్నగర్ జిల్లాలోని పీఏవో అసలు విధులకే రావడం లేదనే ఆరోపణలు వస్తున్నా యి. ఫైళ్లను చేతపట్టుకుని హైదరాబాద్లో నివాసం ఉండే సంబంధిత పీఏవో దగ్గరికి తీసుకెళతారని సమాచారం. రోజు డ్యూటీకి రాకపోవడంతో ఇంట్రా బిల్లుల చెల్లింపులు తీవ్ర ఆలస్యమవుతున్నట్టు సమాచారం. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు ఒక ఇంట్రా బిల్లును సైతం పీఏవో పాస్ చేయలేదని విమర్శలు వస్తున్నాయి. బిల్లులు చెల్లించడంలో జరుగుతున్న ఆలస్యం మూలంగా పనులు నెమ్మదించాయని ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్ ఇన్ చీఫ్కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
బిల్లుల చెల్లింపుల్లో ఇలా అక్రమాలు
నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్, ఆసిఫాబాద్, యాదాద్రి-భువనగిరి, నల్లగొండ తదితర జిల్లాల్లో బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయి. పనులను ఎంబీ(మెజర్మెంట్ బుక్)లో ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్(ఈఈ) రికార్డు చేసిన తరువాత వాటిని పీఏవోకు పంపుతారు. అక్కడ అమోదం పంపిన అనంతరం మళ్లీ ఈఈకి వెళుతుంది. మొత్తం సమాచారాన్ని అన్లైన్లో నమోదు చేసి తిరిగి పీఏవోకి పంపుతారు. అక్కడ ఒకే చేసిన తరువాత ఇంజినీర్ ఇన్ చీఫ్కు వెళుతుంది. అక్కడ ఆన్లైన్లో గ్రీన్సిగల్ ఇస్తే డబ్బులు సంబంధింత కాంట్రాక్టర్ లేదా వర్క్ ఏజెన్సీ ఖాతాలోకి వెళతాయి. పీఏవోల దగ్గర జరుగుతున్న జాప్యం నేపథ్యంలో ఇంట్రా విలేజ్ నెట్వర్క్ పనులు ఆలస్యమవుతున్నట్టు ఇంజినీర్లు సైతం అంగీకరిస్తున్నారు.
వచ్చేస్తున్న 'భగీరథ' మోటార్లు
ఈ ప్రాజెక్టు నిర్వహణ కోసం భారీ సామర్థ్యంతో కూడిన విద్యుత్ మోటార్ పంపుసెట్లను రప్పించేందుకు భగీరథ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలకు ప్రభుత్వం ఇప్పటికే పంపుసెట్ల కోసం ఆర్డర్లు ఇచ్చింది. భగీరథ ప్రాజెక్టు వ్యయం రూ 47 వేల కోట్లల్లో ఎలక్ట్రో మెకానికల్ పనుల కోసం రూ. 600 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 26 సెగ్మెంట్లల్లో దాదాపు 1329 విద్యుత్ మోటారు పంపుసెట్లు అవసరం. వీటి సామర్థ్యం 82,732 హార్స్పవర్(హెచ్పీ)గా ఇంజినీర్లు తేల్చారు. ఇప్పటికే ఆయా కంపెనీలు ఈ మోటార్ల తయారీని పూర్తిచేసినట్టు భగీరథ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. విద్యుత్ మోటార్ల తయారీలో విస్త్రృత అనుభవం ఉన్న కిర్లోస్కర్, ఫ్లోమోర్, మాథరన్ఫ్లాట్, విల్లో తదితర కంపెనీలకు భగీరథ ఇంజినీరింగ్ విభాగం టెండర్ల ద్వారా అప్పగించింది.
విద్యుత్ మోటర్ల నాణ్యతపై ఈఎన్సీ శ్రద్ద
తొలిదశలో డిసెంబర్ నెలాఖరులోగా తాగునీటిని ప్రజలకు అందించాల్సిన నేపథ్యంలో మోటార్ పంపుసెట్ల తయారీపై ఇంజినీర్ ఇన్ చీఫ్ బి.సురేందర్రెడ్డి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. చీఫ్ ఇంజినీర్లు కృపాకర్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, విజయ్ పాల్రెడ్డి, విజయ్ ప్రకాశ్ తదితరులను ఎప్పటికప్పుడు తనిఖీలకు పంపిస్తున్నారు. పుణే, వాడీ, ముంబై, హర్యానా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో తయారవుతున్న మోటార్లను ఎప్పటికప్పుడు ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు చీఫ్ ఇంజినీర్లు తనిఖీలు చేస్తున్నారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి ఆయా కంపెనీలను సందర్శిస్తున్నారు.
నాలుగు ప్యాకేజీలుగా మోటారు పంపుసెట్లు
మొత్తం నాలుగు ఫ్యాకేజీలుగా మోటారు పంపుసెట్లను విభజించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఒక ప్యాకేజీ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు కలిపి రెండో ప్యాకేజీ, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు కలిపి మూడో ప్యాకేజీ, మెదక్, నల్లగొండ తదితర జిల్లాలను నాలుగో ప్యాకేజీలుగా భగీరథ కార్పొరేషన్ విభజించింది. మెగా ఇంజినీరింగ్, నాగార్జున కన్స్ట్రక్చన్, రాఘవ కన్స్ట్రక్చన్ కంపెనీ, లార్సన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) కంపెనీలకు అప్పగించింది. ఈ ఫ్యాకేజీలను ఆయా సెగ్మెంట్లల్లో పనులు చేస్తున్న వర్క్ ఏజెన్సీల ద్వారానే మోటారు పంపుసెట్లను సైతం సమకూర్చుకుంటున్నది. మొత్తం 1329 మోటార్లకు 92,732 హార్స్వపర్ (హెచ్పీ) సామర్థ్యం ఉన్న పంపుసెట్లకు సుమారు 280 మెగావాట్ల విద్యుత్ అవసరమని అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు ట్రాన్స్కో చేపట్టిన పనులు చివరిదశలో పనులు ఉన్నట్టు సమాచారం.