పేకాటకు మరిగిన భార్య ఎంతకి తెగించిందంటే..! భర్తనే కత్తితో..
హైదరాబాద్ : వ్యసనానికి మరిగితే ఎంతకైనా తెగిస్తారంటే ఇదేనేమో..! పేకాటకు అడ్డు చెప్పినందుకు ఏకంగా భర్తనే కత్తితో పొడిచేసింది ఓ భార్య. హైదరాబాద్ లోని ఈద్గా రోడ్ లో ఉన్న మాధవ్ పురాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, భార్య దాడిలో తీవ్రంగా గాయపడ్డ భర్త తార్నాక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పూర్తి వివరాలను పరిశీలిస్తే.. మోషీన్ షేక్ (32) అనే ఎంబ్రాయిడరీ వర్కర్ భార్య రాఖీ (30), కుమారుడు, ఇద్దరు కూతుళ్లతో కలిసి జుగల్ దాస్ వీధిలో నివాసముంటున్నాడు. అయితే పేకాటకు అలవాటుపడ్డ భార్య తరుచూ కుమారుడిని ఇంటి వద్దే వదిలేసి పేకాట ఆడడానికి వెళ్లడం అలవాటు చేసుకుంది. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి మున్నా అనే వ్యక్తి వచ్చి రాఖీని పేకాటకు రావాల్సిందిగా కోరాడు.
రాఖీ వెళ్లడానికి సిద్దపడడంతో.. భర్త మోషీన్ అందుకు అడ్డు చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన భార్య రాఖీ భర్త మోషీన్ ను కత్తితో పొడిచింది. అనంతరం ఆమె పేకాటకు వెళ్లిపోగా.. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్లు మోషీన్ ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రంగానే అవడంతో మోషీన్ కు 20 కుట్లు పడ్డట్లు తెలుస్తోంది.
అనంతరం మోషీన్ వాంగ్మూలంతో అతని భార్య రాఖీపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం అతనికి ఆరోగ్యంగా నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఘటన జరిగిన సందర్బంలో పిల్లలు వేరే గదిలో నిద్రిస్తున్నారని తెలిపాడు మోషీన్.
మోషీన్ తెలిపిన వివరాల ప్రకారం.. తాగుడుకు, పేకాటకు అతని భార్య రాఖీ బానిసగా మారింది. దీంతో పేకాట, మధ్యం సేవించడమే లోకంగా గడుపుతున్న ఆమెను భర్త మోషీన్ తరుచూ వారించే ప్రయత్నం చేస్తుండడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తుతూ వస్తున్నాయి. అయితే ఎప్పుడూ గొడవతోనే సర్దుకునే పరిస్థితి తొలిసారి ఇలా.. తనపై దాడి చేసేవరకు వెళ్లిందని తెలిపాడు మోషీన్.
మోషీన్ సోదరి అయేషా మాత్రం గతంలోనే మోషీన్ పై రాఖీ దాడి చేసిందని తెలపడం గమనార్హం. కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.