అరుపులు, అరెస్టులు, అయోమయం.. ఆగమాగం..! తెలంగాణ బంద్ తో విచిత్ర పరిస్థితులు..!!
హైదరాబాద్: ఆర్టీసి కార్మికులు ఇచ్చిన బంద్ పిలుపు తెలంగాణలో హింసాత్మకంగా మారింది. అరెస్టులతో బంద్ ను అణచి వేసేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు ప్రభుత్వం నుండి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని పలు చోట్ల రాజకీయ నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన సమ్మె 15వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు మద్దతుగా సికింద్రబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద బంద్లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలని ఈ సందర్భంగా కోదండరామ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ బంద్ హింసాత్మకం.. కోదండరాం, రమణ, రావుల, మోత్కుపల్లి అరెస్టు..
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ నేపథ్యంలో ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లా బోధన్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లోని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బోధన్ డిపో ఎదుట ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్, రాణిగంజ్, కంటోన్మెంట్ల్లోనూ బస్సులను డిపోల నుంచి కదలనివ్వలేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు ఆయా డిపోల ఎదుట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
సీఎం పై మండిపడ్డ విమలక్క.. కార్మికులను అరెస్టు చేయడం తగదన్న ప్రజా గాయకురాలు..
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు నేడు తలపెట్టిన రాష్ట్ర బంద్ కు అరుణోదయ కళాకారిణి విమలక్క మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు తమ సమ్మె విరమించిన తర్వాత చర్చలు జరుపుతామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సమ్మె విరమించాక చర్చలేముంటాయని విమలక్క ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలకు అర్థం ఉండాలని ఘాటుగా స్పందించారు. సమ్మె చేయడం కార్మికుల హక్కు అని, సమ్మె చేస్తున్న కార్మికులను అరెస్టు చేయడం అంటే ఉద్యమాన్ని అణచి వేయడమేనని విమలక్క ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు.
బంద్ నేపథ్యంలో పలు పరీక్షలు వాయిదా.. ఇబ్బందిపడుతున్న విద్యార్ధిలోకం.
ఆర్టీసి కార్మికుల సమ్మె విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విద్యార్థులకు సెలవులు పొడిగించడంతో సకాలంలో సెలబస్ పూర్తవుతుందో లేదో ననే ఆందోళన నెలకొంది. అంతే కాకుండా వివిధ కాంపిటీటీవ్ పరీక్షలకు జరగాల్సి ఉండగా బంద్ నేపథ్యంలో వాయిదా పడ్డాదయి. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న బంద్ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నేడు నిర్వహించనున్న పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు వాయిదా పడిన పరీక్షలను తదుపరి నిర్వహించాల్సిన తేదీలను త్వరలో వెల్లడిస్తామని తెలిపడంతో విద్యార్దులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
కేసీఆర్ సర్కార్ కు హైకోర్టు సూచనలు.. కొన్ని అంశాల్లో సీరియస్ ఐన ధర్మాసనం..
ఆర్టీసి సమ్మె పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని న్యాయస్థానం ఆక్షేపించింది. రెండు వారాలు పైగా సమ్మె చేస్తున్న కార్మికులతో ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపలేదని సూటిగా ప్రశ్నించింది. ఆర్టీసీ యూనియన్లతో శనివారం ఉదయం చర్చలు జరపాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వంతో చర్చలకు సిద్దమని యూనియన్లు అంగీకారం తెలియచేయడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ పై వాదనలు జరుగుతున్న సమయంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ సమ్మెకు మరికొన్ని ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు పలికితే ఇక ఎవరూ ఆపలేరని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తిమంతులు అని, వారు తిరగబడితే ప్రభుత్వం నియంత్రించడం కష్టమని ధర్మాసనం పేర్కొంది. శనివారం ఉదయం కార్మికులతో చర్చలు జరపాలని టీఎస్ ఆర్టీసీ యజమాన్యాన్ని హైకోర్టు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.