ఘోరం: చెట్ల పొదల్లో ఆడ శిశువు, పీక్కుతున్న కుక్కలు, పందులు
రంగారెడ్డి: తల్లిదండ్రుల వద్ద అల్లారుముద్దుగా పెరగాల్సిన శిశువులు.. చెట్ల పొదల్లో, మురిగికాల్వల్లో దొరుకుతున్న సంఘటనలో ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఎలాగైనా శిశువులను వదిలించుకోవాలనుకునే తల్లిదండ్రులు ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నారు. దీంతో ఆ శిశువులు కుక్కలు, పందుల బారిన పడి ప్రాణాలు వదలాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఎదురవుతోంది.
తాజాగా ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. అప్పుడే జన్మించిన ఆడ శిశువు(రెండ్రోజుల)ను బస్టాండ్ సమీపంలోని చెట్ల పొదల్లో పారవేశారు గుర్తుతెలియని వ్యక్తులు. కాగా, అక్కడే తిరుగుతున్న కుక్కలు, పందులు ఆ పసికందు శరీర భాగాలను ఛిద్రం చేశాయి.
ఈ ఘోరాన్ని గమనించిన బస్టాండ్లో ఉన్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పొదల్లో నుంచి పసికందు మృతదేహాన్ని బయటకు తీసి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఆడశిశువు జన్మించిందనో, మృత శిశువు జన్మించడంతోనో, మరే ఇతర కారణాలతోనో పారవేసి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.