బంజారాహిల్స్లో దారుణం: పసికందును పీక్కుతున్న కుక్కలు
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సరిగ్గా నెలలు కూడా నిండని ఓ పసికందును కుక్కలు పీక్కుతిన్నాయి. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో నివసించే ప్రైవేటు ఉద్యోగి అలీ అగ్గర్ శనివారం సెకండ్ షో సినిమా చూసి రాత్రి 2.15గంటల సమయంలో ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో అతని ఇంటి సమీపంలో కొన్ని కుక్కలు గుంపులుగా కొట్లాడుకోవడం గమనించాడు.
ఆయన గట్టిగా అరుచుకుంటూ అక్కడకు వెళ్లడంతో కుక్కలు పారిపోయాయి. అయితే, అప్పటికే పసికందును చాలా వరకు కుక్కలు పీక్కుతిన్నట్లు అతడు గుర్తించాడు. వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ పసికందును ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ చిన్నారిని ఎవరు అక్కడ విడిచిపెట్టారన్నది తెలియలేదు. పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యువతిని కారులో కిడ్నాప్ చేసిన దుండగులు
నిజామాబాద్ జిల్లా దుబ్బాక నాగం చెరువు సమీపంలో పశువులు మేపుతున్న 18ఏళ్ల యువతిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు.
దర్పల్లి మండలంలోని స్కల్పబండ తండాకు చెందిన యువతి రోజూ మాదిరిగానే పశువులను మేపేందుకు పొలం వద్దకు వెళ్లింది. కాగా, శనివారం మధ్యాహ్నం కారులో వచ్చిన కొందరు దుండగులు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని పరారయ్యారు.
కాగా, యువతి కేకలు వేయడంతో అక్కడే ఉన్న ఆమె తల్లి గుర్తించి బైక్పై కారును వెంబడించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వెంటనే దర్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.