శిరీష మరొకరికి దక్కకూడదని స్కెచ్ వేసి హత్య: ఇంకెవరైనా సహకరించారా?
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రగతి రిసార్టులో జరిగిన విద్యార్థిని శిరీష హత్య కేసులో నిందితుడు సాయి ప్రసాద్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డీసీపీ పద్మజా రెడ్డి మీడియాకు తెలిపారు. కొత్తూరు మండలం తిమ్మాపూర్కు చెందిన శిరీష బ్యాంకు పరీక్షల కోసం దిల్సుఖ్ నగర్లో శిక్షణ తీసుకుంటోంది.
గురువారం కూడా శిక్షణ కోసం వెళ్లిన శిరీష తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేశారు. కానీ పోలీసులు మాట్లాడారు. పోలీసులు విషయం చెప్పడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. కూతురు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆమె మధ్యాహ్నం చనిపోగా రాత్రి ఫోన్ చేసినప్పుడు పోలీసులు విషయం చెప్పారు.
గతంలో మందలించిన తల్లిదండ్రులు
సాయిప్రసాద్, శిరీషలది తిమ్మాపూర్. ఇరువురి ఇళ్లు కిలోమీటర్ దూరంలోనే ఉన్నాయి. ఇరువురు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత విడిపోయారు. గతంలో వీరి మధ్య ఉన్న ప్రేమ వివాహం తెలిసి శిరీష తల్లిదండ్రులు మందలించారు. దీంతో తాను శిరీషను మరిచిపోతానని సాయిప్రసాద్ చెప్పాడు. కొన్నాళ్లు ఇద్దరి మధ్య స్నేహం లేదు. ఇటీవల తిరిగి ప్రారంభమైంది. ఇరువురు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
అలా స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది
శిరీషది మధ్య తరగతి కుటుంబం. ఆమె తండ్రి డ్రైవర్గా పని చేస్తున్నారు. బ్యాంకింగ్ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటోంది. శిరీషకు సాయిప్రసాద్ సీనియర్. ఒకే ఊరు, ఇద్దరి ఇళ్లు దగ్గరే ఉండటం, కలిసి చదువుకోవడం కారణంగా స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ప్రేమకు దారి తీసింది. ఆ విషయం తెలిసి ఇంట్లో వారు మందలించారు. దీంతో అతను కొన్నాళ్లు దూరంగా ఉన్నాడు. కానీ ఇటీవల మళ్లీ స్నేహం కుదిరింది.
మూడ్రోజుల ముందే కత్తి కొన్నాడు
రిసార్టులో సరదాగా గడుపుదామని గురువారం శిరీషను రిసార్టుకు తీసుకు వెళ్లాడు సాయిప్రసాద్. ఇందుకోసం రిసార్టులోని పదకొండో కాటేజీని ఆన్లైన్ ద్వారా బుక్ చేశాడు. ఇరువురు గంటసేపు బాగా గడిపిన తర్వాత పెళ్లి ప్రస్తావన వచ్చింది. పెళ్లికి అంగీకరించకపోవడంతో ఆమెను కత్తితో పొడిచి చంపాడు. ముందస్తు ప్లాన్ ప్రకారమే ఈ హత్య చేశాడు. మూడు రోజుల క్రితం కత్తి కొన్నాడు. ఆమె అంగీకరించకపోవడంతో ముందస్తు ప్లాన్ ప్రకారం మాట్లాడుకుందామని పిలిచి వెంట కత్తి తెచ్చి హత్య చేశాడని అర్థమవుతోంది.
కిరాతకంగా హత్య చేశాడు
శిరీష ఇటీవల వేరొకరితో స్నేహం చేస్తుందని అతను అనుమానం పెంచుకున్నాడు. తనకు దక్కని శిరీష ఎవరికీ దక్కవద్దని హత్యకు స్కెచ్ వేశాడు. నీతో మాట్లాడాలని చెప్పి రిసార్టులో రూం బుక్ చేశాడు. పెళ్లి ప్రస్తావన రావడంతో ఆమె నో చెప్పడంతో బాత్రూంకు వెళ్లిన ఆమెపై వెంట తెచ్చుకున్న కత్తితో కిరాతకంగా దాడి చేసి చంపేశాడు. రీఫ్రెష్ అయ్యేందుకు ముఖం కడుక్కుంటుండగా వెనుక నుంచి కత్తితో పొడిచి, ఆపై ఛాతిలో పొడిచాడు.
గంటల్లో పట్టుకున్న పోలీసులు
నిందితుడు సాయిప్రసాద్ కొత్తూరులోని కళాశాలలో డిప్లోమా చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. నిందితుడిని పోలీసులు గంటల్లోనే పట్టుకున్నారు. గురువారం రాత్రే బాలాజీ టెంపుల్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. పెళ్లికి నిరాకరించడంతో చంపేసినట్లు అంగీకరించాడు. అతనిని అదుపులోకి తీసుకున్నప్పుడు అతని చేతిలో కత్తి కూడా ఉంది.
ఒక్కడే హత్య చేశాడా, ఎవరైనా సహకరించారా?
కాగా, శిరీషను నిందితుడు ఒక్కడే హత్య చేశాడా? లేక ఇంకెవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుడిని చేవెళ్ల పోలీస్ స్టేషన్లో విచారించారు. ఆమెపై అత్యాచారం చేయలేదని చెప్పాడని తెలుస్తోంది.
డీసీపీ ఏం చెప్పారంటే?
తనతో పెళ్లికి ఒప్పుకోకపోవడం, వేరెవరితోనో చనువుగా ఉంటుందనే అనుమానంతో తనకు దక్కని శిరీష ఇంకెవరికీ దక్కకూడదని ఈ దారుణానికి ఒడిగట్టాడని డీసీపీ తెలిపారు. గురువారం సాయంత్రం ప్రగతి రిసార్టు నుంచి హరిబాబు అనే వ్యక్తి మాకు ఫోన్ చేసి హత్య గురించి చెప్పారని, వెంటనే ఇన్స్పెక్టర్ శశాంక్ తన టీంతో అక్కడికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించారని, క్లూస్ టీం ఆధారాలను సేకరించిందని, అనంతరం 8 గంటలకు శిరీష తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పామని, ఆయన వచ్చాక సాయిప్రసాద్పై అనుమానం వ్యక్తం చేశారని, దీంతో అతని కోసం గాలించి అదుపులోకి తీసుకున్నామన్నారు.