విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే..!రాష్ట్రపతిని కలుస్తామన్న అఖిలపక్ష నేతలు..!!
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామని అఖిలపక్ష నేతలు ప్రకటించారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పిదాలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టారు. విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని ఈ సందర్భంగా పలువురు నేతలు విమర్శించారు. కేసీఆర్ సర్కార్ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. తెరాస ప్రభుత్వ నిరంకుశ ధోరణుల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అఖిలపక్ష నేతలు ఆక్షేపించారు.
కీలక సమయంలో విహార యాత్రలా? కేసీఆర్ పై మండిపడ్డ అఖిలపక్షం..!!
ఇంటర్ ఫలితాల్లో అవకతవకల సమస్యకు పరిష్కారం చూపకపోతే ప్రభుత్వంపై సీరియస్గా స్పందిస్తామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. త్వరలోనే రాష్ట్రపతిని కలవనున్నట్టు ఆయన స్పష్టంచేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా సాధించడమే తమ లక్ష్యమన్నారు. మూడు రోజుల్లో స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. రెండు నెలలు దిద్దాల్సిన పేపర్లను నెలలోనే పూర్తిచేశారని ఆయన ఆరోపించారు.
నష్టపరిహారం చెల్లించాల్సిందే..! డిమాండ్ చేసిన కోదండరాం..!!
ఎన్నో బాదలకోడ్చి తమ పిల్లలను తల్లిదండ్రులు చదివించుకుంటున్నారని కోదండరాం ఆవేదన వ్యక్తం చేసారు. నేడు ధర్నా చౌక్ వద్ద ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై నిరసన తెలిపారు. గ్లోబరినా సంస్థ విద్యార్థుల వివరాలు తప్పుగా ఎంటర్ చేసిందని ఆరోపించారు. సమయం కుదించడంతో ఇన్విజిలేటర్లపై భారం మోపారని తెలిపారు. ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చనిపోతుంటే సీఎం విహారయాత్రకు ఎట్లా పోతారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడక పోతే విద్యార్థుల కుంటుంబాలను ఆదుకునేందుకు అవసరమైతే చందాలు వసూలు చేస్తామని తెలిపారు.
అవన్నీ సర్కారీ హత్యలే...! సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటు విమర్శలు..!!
చనిపోయిన విద్యార్థులు భావి భారత పౌరులని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. 1200మంది విద్యార్థుల చనిపోయిన తర్వాత తెలంగాణ వచ్చింది. కావున ఇక ఆత్మహత్యలు జరగవు అనుకున్నామని గుర్తుచేశారు. చంద్రశేఖర్ రావు ఆనాడు నిరాహారదీక్ష లో ఉన్నపుడు కవిత, హరీష్, కేటీఆర్ తనను అడిగారు-దీక్ష విరమింప చేయండి చంద్రశేఖర్ రావు చనిపోయేలా ఉన్నారని తెలిపారు. చనిపోయిన విద్యార్థుల ప్రాణాలు చంద్రశేఖర్ రావు లాంటి ప్రాణాలు కావా అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన పాపాలు పోవడానికే గుళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ దీక్షలో టీడీపీ నాయకులు ఎల్.రమణ, మందకృష్ణ, ఏఐసీసీ ఇంచార్జ్ అర్ సి కుంతియా, రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
అఖిలపక్షంలో కాంగ్రెస్ కీచులాట..! కుర్చీ కోసం కుస్తీ పట్టుకున్న నేతలు..!!
ఇదిలా ఉండగా ధర్నాచౌక్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్ విద్యార్తుల ఆత్మహత్యలపై ఇందిరా పార్క్ వద్ద శనివారం అఖిలపక్షం ధర్నా నిర్వహించిన సందర్భంగా కాంగ్రెస్ నేతలు మధ్య వాగ్వాదం నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తో పాటు నగేశ్ మద్య వాగ్వాదం నెలకొంది. దీంతో ఇద్దరు ఒకరిని ఒకరు తోసుకున్నారు. ఇద్దరు కొట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నగేశ్ వ్యవహార శైలిపై వీ. హనుమంతరావు అభ్యంతరం వ్యక్తం చేసారు. వీహెచ్ కుర్చీని కుంతియాకు నగేశ్ ఇవ్వడంతో ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొన్నట్టుగా తెలుస్తోంది. నిరశనలో పాల్గొనాడికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు, అఖిల పక్ష నేతలు ఈ సంఘటన పట్ల అవాక్కయినట్టు తెలుస్తోంది.