అయ్యప్పమాల ధరించిన విద్యార్థిని అనుమతించని స్కూల్... ఫర్నిచర్ ధ్వంసం చేసిన అయ్యప్ప స్వాములు
ఓ ప్రైవేట్ పాఠశాల వివాదస్పద నిర్ణయం తీసుకుంది. ఓ విద్యార్థి అయ్యప్ప మాల వేసుకున్నాడనే కారణంతో విద్యార్థిని పాఠశాలలోకి అనుమతి ఇవ్వలేదు. దీంతో విషయం తెలుసుకున్న అయ్పప్ప స్వాములు స్కూల్ ముందు బైఠాయించారు. దీంతో జారుకున్న ప్రిన్సిపల్ ఎంతకీ రాకపోవడంతో అయ్యప్ప స్వాములు స్కూల్ కార్యాలయంలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
ఈ సంఘటన యాదాద్రీ భువనగిరి జిల్లాలో జరిగింది. భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో అయిదవ తరగతి చదువుతున్న విద్యార్థి అయ్యప్ప మాల ధరించాడు. దీంతో ఆ విద్యార్థిని స్కూల్ యాజమాన్యం 16 రోజుల పాటు స్కూళ్లోకి అనుమతించలేదు. ఇదే విషయాన్ని విద్యార్థి తండ్రి మాల వేసుకున్న ఇతర స్వాములకు తెలియ జేశాడు. విషయం తెలుసుకున్న స్వాములు సంబంధిత పాఠశాల ముందు బైఠాయించారు. యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
అయితే పరిస్థితిని గ్రహించిన స్కూల్ ప్రిన్సిపల్ అక్కడ నుండి జారుకున్నారు. అక్కడ ఉంటే దాడులు జరిగే అవకాశం ఉండడంతో స్కూలు నుండి మళ్లి వస్తానని బయటపడ్డాడు. ప్రిన్సిపల్ ఎంతకి తిరిగి రాకపోవడంతో ఆగ్రహం చెందిన స్వాములు స్కూల్ ఆఫీల్లోకి దూసుకెళ్లి అక్కడ ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు స్కూల్కు చేరుకున్నారు. ఇక ఇదే స్కూల్ యాజమాన్యం గతంలో కూడ గణపతి మాల వేసుకున్న విద్యార్థిని కూడ అనుమతించలేదని వారు ఆరోపణలు చేశారు. దీంతో వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.