పిట్టల్లా రాలిపోతున్న విద్యార్థులు..! నోరు మెదపని కేసీఆర్..! థర్డఫ్రంట్ ప్రయత్నాలపై అభ్యంతరాలు..!!
హైద్రాబాద్: తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో సీఎం చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలపై దృష్టి సారించారు. రానున్న ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తాయని, జాతీయ పార్టీలు స్వంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదని చంద్రశేఖర్ రావు కొన్ని నెలలుగా చెబుతున్నారు. దేశ వ్యాప్త పర్యటన కోసం చంద్రశేఖర్ రావు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సరిగ్గా ఇక్కడే చంద్రశేఖర్ రావు విమర్శలను ఎదుర్కొంటున్నారు.
ఇంటర్ విద్యార్థుల ఆందోళనతో అట్టుడుకుతున్న రాష్ట్రం..! కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పై విమర్శలు..!!
బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటు దిశగా కార్యాచరణ ప్రారంభించిన చంద్రశేఖర్ రావు మరోసారి జాతీయ నేతలతో భేటీ కానున్నారు. ముందుగా లోక్సభ ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో పర్యటించాలని చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఐతే రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో వారికి బాసటగా ఒక్క ముక్క మాట్లాడని చంద్రశేఖర్ రావు థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలేంటని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
దేశ రాజకీయాలు సరే..! రాష్ట్రంలో ఆందోళనల మాటేంటంటున్న తల్లిదండ్రులు..!!
ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ప్రత్యర్థుల అంచనాకు అందని దాఖలాలు చాలానే ఉన్నాయి. గతేడాది ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఆయన చేసిన ప్రకటన కూడా అలాంటిదే. అప్పటి దాకా రాష్ట్రానికే పరిమితమైన చంద్రశేఖర్ రావు, ఢిల్లీ రాజకీయాలను దృష్టి సారించడం ప్రస్తుత తరుణంలో చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర అయ్యే పని కాదని ప్రత్యర్థులు ఇప్పటికీ విమర్శిస్తూనే ఉన్నారు. పైగా ఇంటర్ వ్యవహారంతో రాష్ట్రం రావణకాష్టంలా కాలిపోతున్న ఈ సమయంలో ఫెడరల్ ఫ్రంటేంటనే చర్చ కూడా జరుగుతోంది.
విద్యార్థుల భవితకు సీయం భరోసా ఇవ్వాలంటున్న పేరెంట్స్..! ఇంత నిర్లక్ష్యం ఏంటని ప్రశ్న..!!
తెలంగాణ ఇంటర్ మీడియట్ బోర్డ్ చేసిన తప్పిదాలతో ఇంతవరకూ 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా, గత మూడు రోజుల నుంచి కొనసాగుతున్న నిరసనల సెగ నేడు సీఎం క్యాంప్ ఆఫీస్ ను తాకింది. నిన్నటివరకూ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నాలకు దిగిన విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు నేడు సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రగతిభవన్వైపు దూసుకెళ్లిన ఆందోళనాకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఆరు నిరశనలు, మూడు ధర్నాలు..! ఇంటర్ ఉదంతంలో విద్యార్ధి సంఘాల ఎంట్రీ..!!
మరోవైపు ఇంటర్బోర్డు ముట్టడికి డీవైఎఫ్వై విద్యార్థి సంఘం, గ్లోబరీన్ టెక్నాలజీ సంస్థ ముట్టడికి సీపీఐ పిలుపు నిచ్చాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మరోవైపు రీవాల్యుయేషన్ కు దరఖాస్తు గడవును రెండు రోజుల పాటు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నిర్నయంపై విద్యార్థులు గాని, వారి తల్లి దండ్రులు గాని అంత సంత్రుప్తిగా లేరని తెలుస్తోంది. ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలతో పాటు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ జరిగిన దారుణం గురించి ఎందుకు నోరు మెదపడంలేదని విమర్శిస్తున్నారు. పైగా ఫెడరల్ ఫ్రంట్ అంటూ రాష్ట్రాల పర్యటనకు ప్లాన్ చేయడం దారుణమైన అంశమని వారంటున్నారు.