కొట్టుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధులు, రెండేళ్ల చిన్నారిపై కుక్కల దాడి
హైదరాబాద్: నగరానికే తలమానికమైన 'హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ' (హెచ్సీయూ)లో మంగళవారం ఉదయం విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ల మొదలైన చిన్న గొడవ చిలికి చిలికి పెద్ద గొడవగా మారింది.
ఈ నేపథ్యంలో విద్యార్థులు రెండు గ్రూపులుగా ఏర్పాడి ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఏబీవీపీ నేత సుశీల్ గాయపడ్డాడు. గాయపడ్డ అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ తమపై అకారణంగా దాడికి దిగిందని ఆరోపిస్తూ, ఏబీవీపీ విద్యార్ధులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.
దీంతో అక్కడ పరిస్ధితి ఉద్రక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్ధితి అదుపు తప్పకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్ధితి అదుపులోనే ఉంది.
రెండేళ్ల చిన్నారిపై కుక్కల దాడి
రెండేళ్ల చిన్నారిపై కుక్కల మంద దాడి చేసిన సంఘటన మహాబూబ్నగర్ జిల్లాలోని అయిజ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. చిన్నారిపై ఒకేసారి 8 కుక్కలు దాడి చేయడంతో ఆమె పరిస్ధితి విషమంగా మారింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నారిపై కుక్కల దాడి ఘటనతో స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామం నుంచి కుక్కల బెడదను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.