స్టూడెంట్స్ ఫైట్, విద్యార్థి పరిస్థితి విషమం, శ్రీ చైతన్య వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : ఈమధ్య కాలంలో కాలేజీ కుర్రాళ్లు రోడ్ల మీదికెక్కి రౌడీల్లా కొట్టుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. మొన్నీమధ్యే చైతన్యపురిలోని శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థులు రోడ్ల మీద హంగామా సృష్టించగా.. నిన్నటికి నిన్న క్లాస్ రూమ్ లోనే ఐదారుగురు విద్యార్థులు ఒక విద్యార్థిని టార్గెట్ చేసుకుని చితకబాదిన ఘటన వైరల్ వీడియో ద్వారా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక తాజా ఘటన హైదరాబాద్లోని బాగ్ అంబర్ పేట శ్రీ చైతన్య కాలేజీ వద్ద చోటు చేసుకుంది. చైతన్య కాలేజీ విద్యార్థి విజయ్వర్థన్పై అదే కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు శుక్రవారం నాడు తీవ్రంగా దాడి చేసినట్లు సమాచారం. దీంతో తీవ్ర గాయాలపాలైన విజయవర్థన్ ను హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. కాగా, ప్రస్తుతం విజయ్ వర్ధన్ పరిస్థితి విషమంగా మారిందని తెలుస్తోంది.
అంతర్గతంగా తీవ్ర గాయాలు కావడంతో.. అతడికి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించినట్లు సమాచారం. విజయవర్థన్ పై దాడి నేపథ్యంలో శనివారం నాడు కాలేజీకి సెలవు ప్రకటించింది యాజమాన్యం. అయితే యాజమాన్యం తీరుకు నిరసనగా విద్యార్థి విజయ్వర్థన్ బంధువులు, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు కాలేజీ ముందు ఆందోళనకు దిగడంతో.. ప్రస్తుతం కాలేజీ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
విజయవర్థన్ కుటుంబానికి న్యాయం చేయాలని శ్రీ చైతన్య యాజమాన్యాన్ని నిలదీస్తున్నాయి విద్యార్థి సంఘాలు. ఇదిలా ఉంటే, విజయవర్థన్ పై దాడి చేసిన ముగ్గురు విద్యార్థుల్లో ఒకరిని కేసు నుంచి తప్పించేందుకు పోలీసులపై కూడా ఒత్తిళ్లు తీసుకువస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.