పగలేమో కోచింగ్.. రాత్రయితే ఎంతలా బరితెగిస్తారంటే!
ఈజీమనీ కోసం దారిన వెళ్లేవారిని బెదిరించి దోపిడీలకు పాల్పడటం మొదలుపెట్టారు. ఇలా పలువురి వద్ద సెల్ ఫోన్ లు, డబ్బులు లాక్కునేవారు.
హైదరాబాద్: వాళ్లంతా చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులు.. పగలంతా కోచింగ్ సెంటర్లలో బుద్దిగా పాఠాలు వింటారు. రాత్రయితే మాత్రం రోడ్ల మీద మాటు వేసి దోపిడీలకు పాల్పడుతుంటారు. చైతన్యపురి పరిధిలో గత కొంతకాలంగా దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం..నల్గొండ జిల్లా నకిరేకల్కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎస్బీహెచ్ కాలనీలోని ఓ రూమ్లో గత కొంతకాలంగా అద్దెకు ఉంటున్నారు. చదువులు పూర్తి చేసుకున్న వీరంతా ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయ్యారు.
అయితే జల్సాలకు అలవాటు పడిన ఈ గ్యాంగ్.. ఈజీమనీ కోసం దారిన వెళ్లేవారిని బెదిరించి దోపిడీలకు పాల్పడటం మొదలుపెట్టారు. ఇలా పలువురి వద్ద సెల్ ఫోన్ లు, డబ్బులు లాక్కునేవారు. ఇదే క్రమంలో చైతన్యపరిధిలోని మోహన్నగర్లో ఓ ఆటో డ్రైవర్ పై దాడికి పాల్పడి డబ్బులతో పాటు, సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు.
దీంతో సదరు ఆటో డ్రైవర్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగుచూసింది. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. ఈ గ్యాంగ్ లో ఒక మైనర్ ఉన్నట్లుగా తెలిపారు. చదువులు, ఉద్యోగాల కోసం పిల్లలను నగరానికి పంపించే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నేరస్తులుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.