విద్యార్థులకు బూతు వీడియోలు చూపిస్తున్న హెడ్ మాస్టర్.. తొలగించాలని డిమాండ్..
విద్యార్థులను మంచి మార్గంలో పెట్టాల్సిన ఆ హెడ్ మాస్టర్ తన వక్రబుద్దిని బయటపెట్టుకున్నాడు. పాఠాల సంగతి పక్కనపెట్టి.. బూతు వీడియోలు చూపించడం మొదలుపెట్టాడు. హెడ్ మాస్టర్ ప్రవర్తనపై ఓపిక పట్టిన విద్యార్థులు.. ఇక ఆయనలో మార్పు రాదని నిర్ణయించుకుని యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. జనగామ జిల్లా నర్మెట్టలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా నర్మెట్టలోని ప్రభుత్వ పాఠశాలలో అవధూత శ్రీనివాస్ అనే వ్యక్తి హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. అయితే శ్రీనివాస్ కొన్నాళ్లుగా తమకు బూతు వీడియోలు చూపిస్తూ వేధిస్తున్నాడని విద్యార్థులు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు,మాజీ సర్పంచ్,గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి హెడ్ మాస్టర్ తమకు వద్దంటూ తల్లిదండ్రులతో కలిసి పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. శ్రీనివాస్ను తక్షణం విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
ఘటనపై స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కరుణాకర్ మాట్లాడుతూ.. హెడ్ మాస్టర్ శ్రీనివాస్ను పద్దతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించామని,అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని అన్నారు. విద్యార్థులనే కాదు టీచర్లను కూడా అతను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు.
మరోవైపు హెడ్ మాస్టర్ శ్రీనివాస్ మాత్రం తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. స్కూల్లో టీచర్స్ అంతా క్లాస్రూమ్స్లో పాఠాలు చెప్పాలిందిపోయి.. సెల్ఫోన్లతో ఆడుకుంటున్నారని, దానిపై వారిని హెచ్చరించినందుకే తనపై కక్ష కట్టి ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు తాను బూతు వీడియోలు చూపించట్లేదని, విద్యార్థులను తనపైకి ఉసిగొల్పి ఇలా చేయిస్తున్నారని ఆరోపించారు.
ఇదిలా ఉంటే, ఘటనపై స్థానికులు కూడా మండిపడుతున్నారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని స్కూల్కు పంపిస్తే.. హెడ్ మాస్టర్ నుంచే వేధింపులు ఎదురవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఘటనపై విచారణ జరిపి హెడ్ మాస్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.