రివర్స్; టెక్కీ కోర్సులకు తగ్గిన డిమాండ్, జాబ్ ఓరియెంటేడ్ కోర్సులపై యువత ఆసక్తి
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల కారణంగా ఐటీ కోర్సుల్లో కోచింగ్ తీసుకొనే విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ప్రత్యామ్నాయ కోర్సులవైపుగా విద్యార్థులు దృష్టిని కేంద్రీకరిస్తున్నారు.
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల కారణంగా ఐటీ కోర్సుల్లో కోచింగ్ తీసుకొనే విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ప్రత్యామ్నాయ కోర్సులవైపుగా విద్యార్థులు దృష్టిని కేంద్రీకరిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్ రంగంలో మార్పులు చేర్పులు చోటుచేసుకొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకొన్న తర్వాత ఇండియాకు చెందిన సాఫ్ట్ వేర్ రంగంపై తీవ్ర ప్రభావం కన్పిస్తోంది.
స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా ట్రంప్ తీసుకొన్న నిర్ణయాలు భారత్ కు చెందిన సాప్ట్ వేర్ కంపెనీలపై ప్రభావం చూపుతున్నాయి.దీంతో స్థానికులకే అనివార్యంగా ఉద్యోగాలను ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఇంజనీరింగ్ పూర్తికాగానే ఎక్కువమంది ఐటీ కోర్సుల్లో చేరేందుకు ప్రయత్నిస్తుంటారు. ఐటీ శిక్షణ సంస్థల్లో చేరే విద్యార్థుల సంఖ్య కూడ క్రమంగా తగ్గుతూ వస్తోంది.
ప్రత్యామ్నాయ కోర్సులపై విద్యార్థుల దృష్టి
ఇంజనీరింగ్ పూర్తి కాగానే ఐటీ కోర్సులు నేర్చుకొనేందుకు ఆసక్తి చూపే విద్యార్థులు ప్రస్తుతం తమ పంథాను మార్చుకొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకొన్న మార్పులను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు విద్యార్థులు ఐటీకి ప్రత్యామ్నాయంగా ఉన్న కోర్సులపై కేంద్రీకరిస్తున్నారు.రెండు దశాబ్దాలుగా హైద్రాబాద్ అమీర్ పేటలోని శిక్షణసంస్థలు కేరాఫ్ గా మారాయి.ఇక్కడ ఉన్న శిక్షణ సంస్థల్లో చేరేందుకు రెండు తెలుగురాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాలనుండి కూడ పెద్ద ఎత్తున విద్యార్థులు వచ్చేవారు.అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఐటీకి ప్రత్యామ్నాయ కోర్సుల వైపు విద్యార్థులు కేంద్రీకరిస్తున్నారు.
కోచింగ్ సెంటర్లపై ప్రభావం
ఐటీ కోచింగ్ సెంటర్లపై ఇటీవల చోటుచేసుకొన్న పరిణామాలు తీవ్రంగా కన్పిస్తున్నాయి. నిత్యం కోర్సులను అభ్యసించేందుకు వచ్చే విద్యార్థులతో ఈ కోచింగ్ సెంటర్లు రద్దీగా ఉండేవి.జావా, డాట్ నెట్, టెస్టింగ్ టూల్స్, శాఫ్ వంటి కోర్సుల్లో చేరేందుకు వచ్చే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గింది. వందల సంఖ్యలో ఈ కోర్సుల్లో శిక్షణ పొందేవారు.అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ తరహ కోర్సుల్లో చేరేవారి సంఖ్య పదుల సంఖ్యకు పడిపోయింది.దీంతో కోచింగ్ సెంటర్లను నిర్వహించడం కూడ కష్టంగా మారిందని కోచింగ్ సెంటర్ల నిర్వహాకులు చెబుతున్నారు.
ఉద్యోగం వచ్చే కోర్సులపై శ్రద్ద
ఐటీ కోర్సులు చేసి ఉద్యోగం కోసం ఏళ్ళతరబడి ఎదురుచూడడం కంటే తక్షణమే ఉద్యోగం వచ్చే కోర్సులకే విద్యార్థులు ప్రాధాన్యత ఇస్తున్నాు. ఈ మేరకు ఆ దిశగా చర్యలను తీసుకొంటున్నారు. అయితే ఐటీలో డిగ్రీలు, పీజీలు చేసినవారు మాత్రమే కోచింగ్ తీసుకొనేందుకు వస్తున్నారు. దీంతో కొంత మేర రద్దీ తగ్గిందనే అభిప్రాయాన్ని శిక్షణ సంస్థ నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు.అయితే ఎప్పటికీ ఇదే పరిస్థితి ఉండకపోవచ్చనే అభిప్రాయాలు కూడ ఉన్నాయి.
సమయాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు
అమెరికా వెళ్ళాల్సిన వారంతా ఇక్కడే ప్రయత్నాలు మొదలుపెడితే ఇక్కడే అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోందనే మాట విన్పిస్తోంది. ఐటీ కోర్సులు నేర్చుకొని సమయాన్ని వృధా చేసుకోవడం కంటే ఇతర రంగాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు విద్యార్థులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ మేరకు ఐటీ కోర్సులను వదిలేసి జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను ఎంచుకొని శిక్షణ తీసుకొంటున్నారు విద్యార్థులు.