పరిపూర్ణానందను బహిష్కరిస్తారా, కోర్టుకెళ్తా: కేసీఆర్కు సుబ్రహ్మణ్యస్వామి హెచ్చరిక
న్యూఢిల్లీ/హైదరాబాద్: శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామిపై నగర బహిష్కరణ మీద బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు లేఖ రాశారు. ఓ సాధువును గూండాలాగా పరిగణిస్తారా అని విమర్శలు గుప్పించారు.
శ్రీరాముడిపై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేసిన మహేష్ కత్తి తీరుకు నిరసనగా పరిపూర్ణానంద శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్దంగా యాత్రకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు పరిపూర్ణానందపై పాత కేసులు చూపించి ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించిన విషయం తెలిసిందే.
ఈ విషయం తెలిసి సుబ్రహ్మణ్య స్వామి మండిపడ్డారు. కేసీఆర్కు లేఖ రాశారు. ఓ స్వామిని గూండాలాగా పరిగణించడం సరికాదన్నారు. దీని వల్ల స్వామీజీ పరువుకు నష్టం కలగదా అని ప్రశ్నించారు. ఇది చాలా అవమానకరమైన, అగౌరవకరమైన, పరువునష్టం కలిగించే చర్య అన్నారు.
ఇలాంటి నగర బహిష్కరణ ఆదేశాల వల్ల స్వామీజీ ప్రాథమిక హక్కులను కాలరాశారని నిప్పులు చెరిగారు. ఓ సాధువు పట్ల ఈ విధంగా ప్రవర్తించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
స్వామి పరిపూర్ణానందపై నగర బహిష్కరణ ఆదేశాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని లేదంటే తాను కోర్టును ఆశ్రయిస్తానని, అంతేకాకుండా నష్టపరిహారం కోరుతానని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వ సమాధానం కోసం ఎదురు చూస్తున్నానని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు.