మహాకూటమి తరుపున వారసుడొచ్చాడు..! ఇక లోక కళ్యాణమే..!!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో సినీ గ్లామర్ కలగలుస్తూ రాజకీయ వాతారణం ఆహ్లాదంగా కనిపిస్తుంటుంది. తెలంగాణలో ముందస్తు తరుముకొస్తున్న తరుణంలో గులాబీ పార్టీకి ధీటుగా ఇతర పార్టీలు అస్త్ర శస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. కాంగ్రెస్.టీడిపి, జనసమితి మహాకూటమిగా ఏర్పడి అదికార కారుపార్టీ అంతం చూస్తామని చెప్పుకొస్తున్నాయి. అది చాలదన్నట్టు తెలంగాణలో స్వర్గీయ యెన్టీఆర్ వారసులను కూటమి తరుపున బరిలోకి దించుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ యెన్టీఆర్ వారసుడు ఎన్నికల బరిలో దిగితే ఆ సీటు ఏకగ్రీవమవుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా వారసుడు..? ఏదా నియోజకవర్గం..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
వేడెక్కిన తెలంగాణ రాజకీయం..! యెన్టీఆర్ వారసుల వేటలో మహాకూటమి..!!
తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి ప్రతి పార్టీని తాకుతోంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో జరగబోయే ఎన్నికలు అన్ని పార్టీల కంటే తెలుగుదేశం పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైనవని చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రతి ఎన్నికల్లో తెలంగాణలోనే మెజారిటీ స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ విభజన తర్వాత ప్రాభవం కోల్పోతూ వస్తోంది. గత ఎన్నికల్లో కేవలం 15 స్థానాల్లోనే విజయం సాధించి, ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా సాధించలేకపోయింది. అందుకే ఈ ఎన్నికలు ఆ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి.
మహాకూటమిదే గెలుపు..! అదే కాంగ్రెస్ పిలుపు..!!
ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా బరిలోకి దిగితే టీఆర్ఎస్ను ఎదుర్కోవడం చాలా కష్టమని భావిస్తున్న టీడీపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలతో జతకట్టబోతుంది. ఈ పార్టీలన్నీ కలిపి మహాకూటమిని ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా తమకు కేటాయించే స్థానాల్లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్న ఆ పార్టీ అధిష్ఠానం అందుకోసం సంచలన నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ పరిధిలో బలమైన కేడర్ ఉన్న టీడీపీ రాబోయే ఎన్నికల్లో ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఒకరికి బరిలోకి దింపాలని భావిస్తోందట.
గ్రేటర్ బరిలో హరి తనయుడు..!! గెలుపు పక్కా అంటున్న నాయకులు..!
ఎన్టీఆర్ మనుమడు, దివంగత నేత నందమూరి హరికృష్ణ తనయుడు, సినీహీరో కల్యాణ్రామ్ను మహాకూటమి తరఫున శేరిలింగంపల్లి లేదా కూకట్పల్లి నుంచి బరిలో దింపేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆ కుటుంబం నుంచి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని టీడీపీ నాయకత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్తో పొత్తుల సందర్భంగా టీడీపీ నేతలు గ్రేటర్ పరిధిలో శేరిలింగంపల్లి, కూకట్పల్లి సహా కొన్ని శాసనసభ స్థానాలు కేటాయించాలని కోరారని వినికిడి. కాంగ్రెస్ నేతలు కూడా కల్యాణ్రామ్ను బరిలో దించే ఆలోచనను స్వాగతిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎవరైనా పోటీచేస్తే ఓ సీటు వదులుకోవడానికి సిద్ధమేనని అంగీకరించినట్లు తెలిసింది.
మహాకూటమికి నందమూరి కుటుంబం ఎస్సెట్...! ఎక్కడ పోటీ చేసినా గెలిచే అవకాశం..!!
ఈ విషయంపై కొందరు టీడీపీ నేతలు కల్యాణ్రామ్ కుటుంబ సభ్యులతో చర్చించగా, మొదట ఆసక్తి చూపలేదని, తాము పట్టుబట్టడంతో మెత్తబడ్డారని, దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఆయనను శేరిలింగంపల్లి నుంచి పోటీ చేయించాలనుకున్నా ఇటీవల పార్టీలో చేరిన మొవ్వాకు చంద్రబాబు హామీ ఇచ్చారని, అందుకే కూకట్పల్లి నుంచి కల్యాణ్ను బరిలో దింపబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఎన్టీఆర్ కుటుంబంపై ఉన్న అభిమానంతో ఆ సీటు టీడీపీ ఖాతాలో చేరడంతో పాటు, జూనియర్ అభిమానులు కూడా ఆ పార్టీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది.