పారిపోయెందెవరు... 'డబుల్' ఇళ్ల పరిశీలనకు సడెన్ బ్రేక్... తలసాని-భట్టి మాటల యుద్దం..
జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంచాయితీ కాక రేపుతోంది. అసెంబ్లీ వేదికగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,సీఎల్పీ నేత భట్టి విక్రమార్కల మధ్య మొదలైన ఈ పంచాయితీ... ఇద్దరూ కలిసి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేదాకా వచ్చింది. మొదటిరోజు సజావుగానే సాగిన 'డబుల్' పర్యటనకు రెండో రోజు మాత్రం అర్ధాంతరంగా బ్రేక్ పడింది. గ్రేటర్ పరిధిలో నిర్మించిన ఇళ్లు చూపిస్తామని చెప్పి... జీహెచ్ఎంసీ పరిధిలోకి రాని వాటిని చూపిస్తున్నారంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల పరిశీలన పర్యటన నుంచి తప్పుకున్నారు.
తుక్కుగూడ,రాంపల్లి ప్రాంతాల్లో పరిశీలన...
రెండో రోజు డబుల్ ఇళ్ల బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనలో భాగంగా మంత్రి తలసాని,మేయర్ బొంతు రామ్మోహన్లతో కలిసి భట్టి విక్రమార్క,కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తుక్కుగూడ,రాంపల్లి ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం ఇళ్ల పరిశీలన కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించిన ఇళ్లు చూపిస్తామని చెప్పి... వేరే చోట్ల నిర్మించిన ఇళ్లను చూపించారని ఆరోపించారు. గ్రేటర్ పరిధిలో లక్ష ఇళ్లు చూపిస్తామని చెప్పి కేవలం 3428 ఇళ్లను మాత్రమే చూపించారని చెప్పారు.
పాత వాటినే మళ్లీ చూపిస్తున్నారన్న భట్టి...
రెండో రోజు పరిశీలనలో మంత్రి తలసాని చూపించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు గ్రేటర్ పరిధిలోకి రావని భట్టి పేర్కొన్నారు. నిజానికి జీహెచ్ఎంసీ పరిధిలోనే వందల ఎకరాల భూమి ఉన్నప్పటికీ... ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో ఎందుకు ఇళ్లు నర్మించిట్లేదని ప్రశ్నించారు. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో చూపించిన ఇళ్లనే ఇప్పుడు కూడా చూపిస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్లోని 150 డివిజన్ల పరిధిలో ఎక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చూపించినా వస్తానని భట్టి చెప్పారు.
ప్రభుత్వం పారిపోయిందన్న భట్టి...
ఇళ్లు చూపించమంటే ప్రభుత్వం పారిపోయిందని భట్టి విమర్శించారు. గురువారం(సెప్టెంబర్ 17) చూపించిన 3,400 ఇళ్లనే లెక్కలోకి తీసుకుంటామని... ఇతర చోట్ల కట్టిన ఇళ్ల లెక్కలను పరిగణలోకి తీసుకోమన్నారు. జీహెచ్ఎంసీలో ఇళ్లు చూపించమంటే.. పక్క నియోజకవర్గాలైన మహేశ్వరంలో ఇళ్లు చూపించారని చెప్పారు. లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్లకు సవాల్ విసిరారు. లక్ష ఇళ్లు నిర్మించి ఇచ్చేంతవరకూ ప్రభుత్వ వెంటపడుతామని చెప్పారు.
Recommended Video
కాంగ్రెస్ నేతలే పారిపోయారన్న తలసాని...
ఇళ్లు పూర్తిగా చూడకుండానే భట్టి మాట్లాడుతున్నారని మంత్రి తలసాని మండిపడ్డారు.లక్ష ఇళ్ల జాబితా ఇస్తామంటే కాంగ్రెస్ నేతలు పారిపోయారని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీలో స్థలం లేనందునే నగర శివారులో ఇళ్లు నిర్మించామన్నారు. ఇళ్లు ఎక్కడ నిర్మించిన హైదరాబాద్ వాసులకే ఇస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు ఓర్వ లేకనే కుంటి సాకులు వెతుకుతున్నారని విమర్శించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో కాంగ్రెస్ నేతలే ప్రభుత్వ భూమి లేకుండా చేశారని ఆరోపించారు. మొత్తం మీద ఇరువురు నేతలు మీరే పారిపోయారంటే మీరే పారిపోయారని విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇళ్ల పరిశీలనకు బ్రేక్ పడినా... మున్ముందు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అంశమే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం లేకపోలేదు.