"కాంగ్రెస్ టీడీపీ సిగ్గుచేటు రాజకీయం ; రెండున్నరేళ్లలో కేసీఆర్ చేసేందేమి లేదు"
హైదరాబాద్ : ప్రాజెక్టుల విషయంలో మంత్రి హరీశ్ రావు తీరును తప్పుబడుతోన్న ప్రతిపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి. తెలంగాణను కోటి ఎకరాల మాగణగా తీర్చిదిద్దాలని తపిస్తోన్న హరీశ్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడ్డారు.
పనిచేసే మంత్రులపై విమర్శలు చేస్తూ పోతే సహించేది లేదని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సుధాకర్ రెడ్డి. మిడ్ మానేరుకు గండిపడిన ఉదంతాన్ని కూడా కాంగ్రెస్, టీడీపీలు రాజకీయం చేయడం సిగ్గుచేటు వ్యవహారమన్నారు. మిడ్ మానేరుకు గండిపడితే ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. రెండేళ్ల క్రితం వరకు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని మరిచిపోవద్దని చెప్పారు.
ఇక కొత్త జిల్లాల విషయాన్ని ప్రస్తావిస్తూ.. సిరిసిల్లను జిల్లా చేయాలని టీడీపీ నేత రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను తప్పబట్టారు సుధాకర్ రెడ్డి. కొత్త జిల్లాలు ప్రజా అవసరార్థమే తప్పితే.. పార్టీలు, నేతల సౌలభ్యం కోసం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వివాదస్పదం చేయడం కాంగ్రెస్, టీడీపీలకు అలవాటుగా మారిపోయిందని ఆరోపించారాయన.
రెండున్నరేళ్లలో కేసీఆర్ చేసేందేమి లేదు : పొంగులేటి
తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. రాష్ట్రంలో కేసీఆర్ మార్క్ పాలనా కొనసాగుతోందని, భద్రాచలం మునిగిపోయే ప్రమాదమున్నా.. పోలవరంపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో కేసీఆర్ చేసేందేమి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.