సుధాకర్ రెడ్డి హత్య: రాజేష్, స్వాతిలకు ఎలా కుదిరింది?
నాగర్కర్నూలు: సుధాకర్ రెడ్డి హత్య కేసులో అతని భార్య స్వాతి నుంచి పోలీసులు పలు విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. స్వాతి ఇచ్చిన సమాచారం మేరకే పోలీసులు కేసు దర్యాప్తులో ముందుకు సాగినట్లు సమాచారం.
ఆమె ఇచ్చిన సమాచారం మేరకు క్లూస్ టీమ్ స్వాతి, సుధాకర్రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టి, పలు ఆధారాలు సేకరించింది. రాజేష్కు, స్వాతికి మధ్య పరిచయం ఏలా ఏర్పడిందని, అంత దాకా ఎలా దారి తీసిందనే విషయాలపై పెద్ద యెత్తున చర్చ సాగుతోంది..
రాజేష్ రూ. 3 వేలకు ఉద్యోగం..
రాజేష్ రూ. 3వేల వేతనానికి ఓ ఫిజియోథెరపి సెంటర్లో పనిచేసేవాడు. అదే సమయంలో స్వాతి చికిత్స కోసం ఆ సెంటర్కు వెళ్లింది. ఆ క్రమంలోనే రాజేష్తో ఆమెకు పరిచయం పెరిగిందని చెబుతున్నారు. అయితే రాజేష్ పరిచయం అయిన మొదటి నెలలోనే సెల్ఫోన్ గిఫ్టుగా ఇచ్చింది. రెండో నెలలో బైక్ ఇచ్చింది. ఈ మార్పులు గమనించిన ఫిజియోథెరఫి సెంటర్ యజమాని రాజేష్ యజమాని ఉద్యోగం నుంచి రెండు నెలల క్రితమే తీసేసినట్లు సమాచారం.
గత నెల25న సుధాకర్ రెడ్డికి తెలిసింది...
గత నెల 25వ తేదీన స్వాతి, రాజేష్ల వ్యవహారం సుధాకర్ రెడ్డికి తెలిసినట్లు సమాచారం. స్వాతి వ్యవహారాన్ని తట్టుకోలేక మనస్తాపానికి గురై సుధాకర్ రెడ్డి భార్యతో వాదనకు దిగాడు. తలను గోడకేసి బాదుకున్నాడని, దాని వల్ల తలపగిలిందని చెబుతున్నారు. అయితే అక్కడే ఉండే తన బంధువుల అబ్బాయితో కలిసి సుధాకర్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడని అంటున్నారు.
మర్నాడు ఇలా జరిగింది..
మర్నాడు గత నెల 26వ తేదీన ఇంటికి వచ్చిన తర్వాత సుధాకర్ రెడ్డి హత్యకు పథకం వేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత సుధాకర్ రెడ్డి నిద్రలో ఉన్నవిషయాన్ని గుర్తించి తన ప్రియుడు రాజేష్ను పిలిపించింది. అక్కడికి వచ్చిన రాజేష్ సుధాకర్ రెడ్డి మెడపై మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత సుధాకర్ రెడ్డి తలపై రాడ్తో కొట్టి హత్య చేశాడు.ఇద్దరు కలిసి సుధాకర్ రెడ్డి మృత దేహాన్ని నవాబ్ పేట మండలం, ఫతేపూర్ అడవి ప్రాంతంలోకి తీసుకువెళ్లి కాల్చేశారు.
రాజేష్ ప్రవర్తన పట్టిచ్చింది...
సుధాకర్ రెడ్డి స్థానంలో రాజేష్ను చూపించి నెట్టుకురావాలని స్వాతి ప్రయత్నించింది. అయితే రాజేష్ ప్రవర్తన, ఆహారపు అలవాట్లు అసలు విషయాన్ని బయటపెట్టినట్లు తెలుస్తోది. తమ అనుమానం వాస్తవమేనని నిర్దారించుకున్న సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి నాటకానికి తెర దించారు.