హైద్రాబాద్లో సుజనా శంకుస్థాపన, మా మాటేంటి.. టి-టిడిపి ఎంపీ అసహనం!
హైదరాబాద్: భాగ్యనగరంలోని ప్రగతి నగర్ ఇన్కాయిస్లో నూతనంగా నిర్మించనున్న అంతర్జాతీయ సముద్ర విజ్ఞాన కార్యాచరణ శిక్షణా కేంద్ర భవనాల సముదాయాన్ని సోమవారం నాడు కేంద్రమంత్రి సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. పూజ అనంతరం ఆయన శిలాఫలకాలన్ని ఆవిష్కరించారు.
అయితే, శిలా ఫలకం పైన స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల పేర్లు లేకపోవడంపై ఆ కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. శంకుస్థపాన చేసిన కేంద్రమంత్రి సుజనా చౌదరి టిడిపికి చెందినవారు.
స్థానిక ఎమ్మెల్యే జి వివేక్, ఎంపీ మల్లారెడ్డిలు కూడా తెలుగుదేశం పార్టీ వారే. అయినప్పటికీ తమ పేర్లు లేకపోవడంపై అధికారుల తీరును తప్పుబట్టారు. ఏపీలో మాత్రమే టిడిపి పార్టీయా, తెలంగాణలో విలువ లేదా అని ఆయన అసహనం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇందిరానగర్లో డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇందిరా నగర్లో డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.
1.5 ఎకరాల్లో 172 కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నట్లు తలసాని చెప్పారు. ఏడాది లోపు ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వం ఇళ్లు నిర్మించిన తర్వాత లాటరీ పద్ధతిలో కేటాయిస్తామన్నారు. నగరంలోని బస్తీలన్నింటినీ అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. ఇళ్ల కోసం దళారీలకు ఎవరూ డబ్బులు ఇవ్వొద్దన్నారు. ప్రభుత్వమే ఇండ్లను కేటాయిస్తుందన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యే గొడవ అధికారికి గుండెపోటు!
మహబూబాబాద్ ఎంపీ సీతారామ్ నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ల మధ్య కోల్ట్ వార్ జరుగుతోంది. వరంగల్ నూతన రిజిస్ట్రార్ కార్యాలయ ప్రారంభోత్సవంలో సోమవారం రభస జరిగింది. ఇరువురు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. సోమవారం ప్రారంభోత్సవం వద్దని సీతారాం నాయక్, ఇవాళే కావాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ పట్టుబట్టారు. వీరి గొడవ మధ్య సబ్ రిజిస్ట్రార్కు గుండెపోటు వచ్చిందని తెలుస్తోంది.