వేములవాడలో భగ్గుమన్న కక్షలు: వార్డు కౌన్సిలర్ తమ్ముడిపై కత్తితో దాడి, ఆస్పత్రిలో చేరిక
రాజన్న సిరిసిల్లా జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో మున్సిపల్ ఓటమితోనే గొడవ జరిగింది. ఓడిపోయిన సుల్తాన్ శేఖర్ అనే వ్యక్తి వార్డు కౌన్సిలర్ తమ్ముడుపై తన ప్రతాపం చూపించాడు. కత్తితో దాడి చేసి బీభత్సం సృష్టించాడు. దాడికి సంబంధించిన ఫుటేజీ సీసీటీవీలో కూడా రికార్డైంది. గాయపడ్డ రాజు పరిస్థితి స్థిమితంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ వార్డు ఎన్నికల ఓటమి సుల్తాన్ శేఖర్ను కుంగదీసింది. వేములవాడ మూడో వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజు సోదరుడు విజయ్ పోటీ చేశారు. ఇక్కడినుంచి ఇండిపెండెంట్గా సుల్తాన్ శేఖర్ బరిలోకి దిగారు. కానీ విజయ్పై సుల్తాన్ శేఖర్ ఓడిపోయారు. విజయ్ గెలుపునకు ప్రధాన కారణం అతని సోదరుడు రాజు అని శేఖర్ భావించాడు. సమయం కోసం చూసి.. ప్రణాళిక ప్రకారం దాడిచేశాడు.
ఓటమి మనస్సులో పెట్టుకొన్న సుల్తాన్ శేఖర్.. రాజును ఆటకాయించాడు. ఎన్నికలకు సంబంధించి మాటా మాటా పెరిగింది. ఇంకేముంది కోపోద్రిక్తుడైన శేఖర్.. అప్పటికే తనతో తీసుకొచ్చిన కత్తితో దాడిచేశాడు. దాడికి సంబంధించిన ఫీడ్ సీసీటీవీలో రికార్టయ్యింది.
రాజు కూలడంతో అక్కడినుంచి శేఖర్ వెళ్లిపోయాడు. వెంటనే రాజును స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. రాజు చెవిభాగంలో కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. దాడి తర్వాత పారిపోయిన సుల్తాన్ శేఖర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.