ప్లాట్ పేరుతో మోసం, రూ.14 లక్షలు వసూల్, కేటుగాడు అరెస్ట్
మోసపోయే వారు ఉంటే కేటుగాళ్లు రెచ్చిపోతూనే ఉంటారు. అమాయకులే లక్ష్యంగా రెచ్చిపోతుంటారు. హైదరాబాద్ నడిబొడ్డున కూడా ఇలాంటి మోసం జరిగింది. భూమి లేకుండానే ఓ సంస్థ మహిళను నమ్మించింది. ఆమె నుంచి ఏకంగా రూ.14 లక్షలు వసూల్ చేసి.. బిచాణా ఎత్తేసింది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పంజాగుట్టలో దమరి ఎస్టేట్స్ ఆఫీసును సుమన్ అండ్ కో ఏర్పాటు చేశారు. భూములు కొనుగోలు చేస్తాం, విక్రయిస్తాం అని చెప్పడంతో ఓ మహిళ ఆశ్రయించారు. ఇంకేముంది ఆమె అమాయకమే పెట్టుబడిగా వ్యవహరించారు. భూమి పేరుతో నగదు కట్టించుకోవడం ప్రారంభించారు. అలా ఒకటి కాదు రెండు కాదు.. 14 లక్షలు ముక్కుపిండీ మరీ వసూల్ చేశాడు. కానీ భూమి మాత్రం చూపించలేదు.
బాధితురాలికి సుమన్ రేపు, మాపు అని కాలం వెళ్ల దీస్తున్నాడు. చివరికి తాను మోసపోయానని బాధితురాలు గ్రహించింది. పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సుమన్ను అరెస్ట్ చేశారు. ఇంకా ఎవరెవరిని మోసం చేశావని ఆరా తీస్తున్నారు. బాధితురాలి నగదు రికవరీ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. బాధితురాలు నగదు ఇప్పిస్తామని, అయితే ఎవరూ కూడా మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ప్లాట్ల పేరు చెబితే.. సంస్థకు రిజిస్ట్రేషన్ ఉందా...? భూమి ఎక్కడ ఉంది అని వివరాలు తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాత నగదు ఇవ్వాలని సజెస్ట్ చేస్తున్నారు.