కేసీఆర్కు పాదాభివందనం, పిలుపు కోసమే: టీఆర్ఎస్లో చేరికపై సుమన్
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు సుమన్ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు గత కొంతకాలంగా ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన తన రాజకీయ ప్రవేశంపై తాజాగా స్పందించారు.
రాజకీయ ప్రవేశంపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని..కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని సుమన్ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గౌడ జాతికి కేసీఆర్ చేసిన మేలు మరువలేనిదని అన్నారు. ఆయన తమ జాతికి చేసిన సహాయానికి పాదాభివందనం చేస్తున్నానని సుమార్ అన్నారు. గీత కార్మికుల సంక్షేమానికి ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాలు తీసుకున్నందున.. జాతి మొత్తం ఆయనకు అండగా నిలిచి రుణం తీర్చుకోవాలని ఆకాంక్షించారు.
కేసీఆర్ తన నుంచి ఎలాంటి సహాయం పొందాలనుకున్నా.. చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమా రంగంలో బీజీగా ఉన్నానని, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, తమిళ సినిమాలు చేస్తున్నట్లు సుమన్ వెల్లడించారు.