చల్లబడ్డ హైదరాబాద్: ఐదేళ్ల కనిష్టానికి ఉష్ణోగ్రతలు, బెంగళూరు, చెన్నై, ముంబైల్లోనూ..
Recommended Video
హైదరాబాద్: శుక్రవారం నాడు రాజధాని నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఏకంగా హైదరాబాద్ నగరంలో ఐదేళ్ల కనిష్టానికి ఉష్టోగ్రతలు పడిపోవడం గమనార్హం. మార్చి 14న 37డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత మార్చి 16న 30.1డిగ్రీలకు చేరింది.
గత కొద్ది రోజులుగా ఎండలతో సతమతమవుతున్న నగరవాసి.. శీతల గాలులకు సేదతీరాడు. నగరంలో శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో వర్షం కురియడంతో వాతావరణమంతా చల్లగా మారిపోయింది. రాజధానితోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా శనివారం ఉదయం నుంచి వర్షాలు కురియడం, చల్లటి గాలులు వీయడంతో ఒక్కసారి వాతావరణం చల్లబడింది.
శుక్రవారం మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు పడగా.. సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో, కుషాయిగూడ, ఈసీఐఎల్, మల్కాజ్గిరి, నేరెడ్మెట్లో వర్షం కురిసింది. సైదాబాద్, సంతోష్నగర్, కోఠి, మలక్పేట, దిల్సుఖ్నగర్, కొత్తపేట, కర్మన్ఘాట్, కంచన్బాగ్, డీఆర్డీఎల్, బాలాపూర్, చంద్రాయణగుట్ట, ఛత్రినాక, ఉప్పుగూడలో వర్షం పడింది.
నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం, జన్నారం, బైంసా మండలాల్లో వర్షం కురిసింది. నిజామాబాద్ పట్టణంలో మోస్తారు వర్షం కురిసింది. కరీంనగర్, జగిత్యాల జిల్లాల వ్యాప్తంగా వర్షం కురిసింది. శంకరపట్నం, మానకొండూర్, రాయికల్, ధర్మపురి, మంథని మండలాల్లో జల్లులు కురిశాయి. మెట్పల్లిలో వర్షంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మెట్పల్లి వాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.