సూపర్ పోలీస్ ... సిఐ సృజన్ రెడ్డిని మెచ్చుకుంటూ హరీష్ రావు ట్వీట్
తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ధైర్యం చేసి బావిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణం పోసిన సీఐ సృజన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా సీఐ సృజన్ రెడ్డి బావిలో చేపల వేటకు దిగిన వారిని ప్రాణాలకు తెగించి కాపాడారు. కాగా... దీనిపై హరీష్ రావు స్పందించారు."ప్రజలకోసం ప్రాణాలకు తెగించడం అంటే ఇదే. ఇటువంటి ధైర్యసాహసాలు మొత్తం పోలీసు శాఖకే గౌరవం తీసుకువస్తాయి. జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డిగారు .. మిమ్మల్ని చూసి పోలీసు శాఖే కాదు, మొత్తం తెలంగాణ సమాజం గర్విస్తోంది. మీ సాహసం మరెందరికో స్ఫూర్తిగానిలవాలి. మీకు నా శాల్యూట్" అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు.
ప్రజలకోసం ప్రాణాలకు తెగించడం అంటే ఇదే. ఇటువంటి ధైర్యసాహసాలు మొత్తం పోలీసు శాఖకే గౌరవం తీసుకువస్తాయి. జమ్మికుంట సిఐ సృజన్ రెడ్డిగారు .. మిమ్ముల్ని చూసి పోలీసు శాఖే కాదు, మొత్తం తెలంగాణ సమాజం గర్విస్తోంది. మీ సాహసం మరెందరికో స్ఫూర్తిగానిలవాలి. మీకు నా శాల్యూట్ pic.twitter.com/TcB7hNoTzT
— Harish Rao Thanneeru (@trsharish) May 29, 2019
ఇంతకీ అసలు మ్యాటరేంటంటే... కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇంటి సమీపంలో ఉన్న చేదబావిలో చేపల వేటకు దిగి శ్వాస ఆడక ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులను కాపాడారు సిఐ సృజన్ రెడ్డి .కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లె గ్రామానికి చెందిన మల్లయ్య(45),మారేపల్లి రవీందర్(45) చేపల కోసం మంచినీటి బావిలో దిగారు. కొంతసేపటికే శ్వాస అందకపోవడంతో బావిలో చిక్కుకుపోయారు. ఇక ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు 108తో పాటు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్న సీఐ సృజన్ రెడ్డి తానే స్వయంగా బావిలోకి దిగి ప్రాణాలు కాపాడారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. మల్లయ్య,రవీందర్లను కాపాడిన సీఐ సృజన్ రెడ్డికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి పోలీసులు కూడా ఉన్నారు అంటూ జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డిని సూపర్ పోలీస్ అని కొనియాడుతున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే హరీష్ రావు సీఐ సృజన్ రెడ్డిని ప్రశంసించారు .