కెసిఆర్ను కలిసిన సూపర్ స్టార్ కృష్ణ: విపక్షాలపై కల్వకుంట్ల కవిత ఫైర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును సూపర్స్టార్ కృష్ణ, ఆయన సతీమణి విజయనిర్మల బుధవారంనాడు క్యాంప్ ఆఫీస్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ నెల 25న జరగనున్న విజయనిర్మల మేనకోడలి వివాహానికి కేసీఆర్ను ఆహ్వానించేందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
వారి వెంట నటుడు నరేష్ కూడా ఉన్నారు. వివాహ మహోత్సవానికి తప్పకుండా రావాలని విజయనిర్మల కెసిఆర్ను, ఆయన సతీమణిని కోరారు. ఈ నెల 25వ తేదీన విజయనిర్మల సోదరుడు రఘునాథ్ కూతురు వివాహం ఉంది. దానికి కెసిఆర్ దంపతులను విజయనిర్మల ఆహ్వానించారు.
ఆ తర్వాత కెసిఆర్ నల్లగొండ జిల్లా సూర్యాపేటకు బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ రాత్రి సూర్యాపేటలోనే బస చేసి రేపు గురువారం అమరావతికి బయలుదేరి వెళ్తారు.
కాగా, బతుకమ్మ ఉత్సవాలపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఉత్సవాల కోసం తెలంగాణ జాగృతి సంస్థకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు.
బతుకమ్మ పండుగ ముగిసిన తర్వాత తొలిసారి ఆమె నిజామాబాద్కు వచ్చిన కవితకు పార్టీ కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు ఘనస్వాగతం తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలను విజయవంతం చేసిన ఆడబిడ్డలకు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పేదల సొంతింటి కలకు ప్రభుత్వం రేపు శ్రీకారం చుడుతుండడం సంతోషకరమని ఆమె అన్నారు.