అందుకే టీడీపీ నుంచి వచ్చాం: రేవంత్ రెడ్డి, పాలన మానుకోవాలి: డీకే అరుణ వార్నింగ్
Recommended Video
నాగర్కర్నూలు: తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు బీసీలను కరివేపాకులా వాడుకొని వదిలేస్తారని కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆదివారం అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన ప్రజా గర్జన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడారు.
బీసీ వర్గానికి చెందిన ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ మధుసూదనా చారిని తొలగించి వేరే వారికి టికెట్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారని, కేసీఆర్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 24 గంటల్లోపు భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్ మధుసూదనా చారికే ఇస్తున్నట్లు ప్రకటించాలని సవాల్ విసిరారు.
ఇవాంకాను ఢిల్లీకి తీసుకెళ్లొచ్చుగా: కేసీఆర్తో పాటు మోడీ టార్గెట్, 'అందగత్తే కాబట్టే'
అందుకే టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరాం
సామాజిక న్యాయం కోసమే తాను, తనతో పాటు పెద్ద ఎత్తున టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరామని రేవంత్ రెడ్డి చెప్పారు. నిరుద్యోగుల కోసం జేఏసీ చైర్మన్ కోదండరాం కొలువుల కోసం కొట్లాట సభకు అనుమతి ఇవ్వమంటే అడ్డుకున్న కేసీఆర్ మద్యం తాగి వేడుకలు చేసుకునే పబ్బులకు మాత్రం అనుమతిచ్చారని ఆరోపించారు. ఎన్నికల ముందు లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి, ఇప్పటి వరకు కేవలం 5,932 ఉద్యోగాలను భర్తీ చేశారన్నారు.
వెంకటేష్కు తగిన ప్రాధాన్యంపై రేవంత్ హామీ
సాక్షాత్తు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గంటా చక్రపాణే ఈ విషయాన్ని వెల్లడించారని రేవంత్ అన్నారు. కోదండరాం సోమవారం నిర్వహించే కొలువుల కొట్లాట సభకు ప్రతి ఒక్కరూ తరలివెళ్లాలన్నారు. అధికారంలో వచ్చి 42 నెలలు పూర్తైనా ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. జనాభాలో యాబై శాతానికి పైగా ఉన్న బీసీల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకొని కేసీఆర్, ఇప్పుడు ఉప ప్రణాళికపై చర్చించడం ఏమిటని ప్రశ్నించారు. తనతో పాటు పార్టీలో చేరిన చారగొండ వెంకటేష్కు అధిష్ఠానంతో మాట్లాడి తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్కు మద్దతు తెలపాలని టీడీపీకి సూచన
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలుపాలని రేవంత్ సూచించారు. ఓయులో మృతి చెందిన విద్యార్థి మురళి గురించి ప్రజాగర్జన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఓయులో విద్యార్థులు, మీడియాపై పోలీసుల దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రతి ఒక్కరిని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారన్నారు. మీడియాపై దాడి చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ రాలేదు
ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు సంపత్, వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని మండిపడ్డారు. అమరుల ఆత్మబలిదానాలతోనే తెలంగాణ వచ్చిందని, కేసీఆర్ ఒక్కడే తెలంగాణ తీసుకు రాలేదని వారు ధ్వజమెత్తారు. సోనియాగాంధీ పుణ్యమా అంటూ తెలంగాణ ఇచ్చినప్పటికి ఆమె పైనే విమర్శలు, ఆరోపణలు చేసిన నీచమైన వ్యక్తి కేసీఆర్ అని పరుషపదజాలంతో మాట్లాడారు కాంగ్రెస్ నేతలు.
కదిలిస్తే పాలన మానుకోవాల్సిందే
కేసీఆర్ పతనం అచ్చంపేట నుంచి ప్రారంభమవుతుందని, కాంగ్రెస్ పార్టీని కదిలిస్తే కేసీఆర్ పాలన మానుకోవాల్సిందేనని డీకే అరుణ అన్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన సభకు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్ కుమార్, వంశీచంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.