వ్యతిరేకత ఉన్నా రాజయ్యకే టిక్కెట్, ఇక మీ ఇష్టం: కడియం క్యాంప్కు కేటీఆర్ షాక్
హైదరాబాద్: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నేతలతో ఆపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం సుదీర్ఘంగా భేటీ అయ్యారు. అంతిమంగా స్టేషన్ ఘనపూర్ టిక్కెట్ తాటికొండ రాజయ్యదేనని తేల్చారు. ఆయనను మార్చాలని కడియం శ్రీహరి అనుచరులు పలువురు విజ్ఞప్తి చేశారు.
రాజయ్య వద్దు, టిక్కెట్ లేదంటే రాజీనామా: కడియంకు అనుచరులు, రంగంలోకి కేటీఆర్
రాజయ్యకు సహకరించండి, లేదంటే మీ ఇష్టం
దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ఒక్కరిని మార్చినా అందరూ మార్చాలని అడుగుతారని వ్యాఖ్యానించారు. రాజయ్యకు అందరూ కచ్చితంగా సహకరించాల్సిందేనని తేల్చి చెప్పారు. లేదంటే ఇక మీ ఇష్టమని కడియం శ్రీహరి వర్గీయులకు సూటిగా చెప్పేశారు. దీంతో కడియం వర్గీయులు అసంతృప్తితో వెనుదిరిగారు. తాము భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని పలువురు నేతలు చెప్పారు.
డిప్యూటీ నుంచి తొలగించినా పార్టీలోనే ఉన్నారు
రాజయ్య సమక్షంలోనే కేటీఆర్ పలువురు నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. రాజయ్య వైఖరిపై పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి కేటీఆర్ సర్దిచెప్పే ప్రయత్నాలు చేశారు. రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినా పార్టీ వీడలేదని కేటీఆర్ గుర్తు చేశారు.
రాజయ్యపై వ్యతిరేకత ఉన్నా అందుకే టిక్కెట్
రాజయ్య ఎంతో నమ్మకంగా పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీ అధినేత కేసీఆర్ ఆయనకు టిక్కెట్ ఇచ్చారని కేటీఆర్ చెప్పారు. రాజయ్యపై స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్నప్పటికీ కేసీఆర్ పైన 80 శాతం సానుకూలత ఉందని చెప్పారు. ఒక్క నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చినా ఇబ్బందులని చెప్పారు. కేసీఆర్ కోసమైనా రాజయ్యను గెలిపించాలని కోరారు. స్టేషన్ ఘనపూర్ విషయంలో మీకు ఏమైనా సమస్యలు ఉంటే తనకు చెప్పాలని కేటీఆర్ వచ్చిన నేతలతో అన్నారు. కావాలంటే మీకు ఇంచార్జిగా నేను ఉంటానని చెప్పారు.
హుజూర్ నగర్ టిక్కెట్ పైన శంకరమ్మ
అలాగే, నిర్మల్ అసంతృప్త నేత శ్రీహరిని కూడా కేటీఆర్ బుజ్జగించారు. మరోవైపు, హుజూర్ నగర్ సీటుపై తెరాసలో తర్జన భర్జన సాగుతోంది. ఈ సీటును జగదీశ్వర్ రెడ్డి అనుచరుడు, ఎన్నారై సైదిరెడ్డికి ఇవ్వవద్దని శంకరమ్మ అల్టీమేటం జారీ చేశారు. టిక్కెట్ ఇస్తే తనకు లేదా ఎన్నారై అప్పిరెడ్డికి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.