ఏఎస్సై మోహన్ రెడ్డి భార్య అరుపులు, అనుచరుల హంగామా (పిక్చర్స్)
కరీంనగర్: అక్రమ వడ్డీ వ్యాపారం కేసులో అరెస్టైన కరీంనగర్ జిల్లా ఏఎస్సై మోహన్ రెడ్డి అనుచరులు గురువారం జిల్లా కోర్టులో వీరంగం సృష్టించారు. లాయర్లను అసభ్యపదజాలంతో దూషిస్తూ కోర్టు ఆవరణలోనే దౌర్జన్యానికి పాల్పడ్డారు. లాయర్లు అందరూ ఏకమై వారిని ప్రతిఘటించడంతో కాసేపు తోపులాట జరిగింది.
అక్రమ వడ్డీ వ్యాపారం, బెదిరింపుల కేసులో అరెస్టై జైల్లో ఉంటున్న మోహన్ రెడ్డిని, మరో పదిమంది ఇతర నిందితులను పోలీసులు గురువారం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చారు. అదే సమయంలో మోహన్ రెడ్డి, ఇతర నిందితుల బంధువులు, అనుచరులు కోర్టుకు వచ్చారు.
కొంతమంది న్యాయవాదులు బాధితులతో మాట్లాడుతుండగా మోహన్ రెడ్డి భార్య లత.. పెద్దగా అరుస్తూ తమను ఫొటోలు తీస్తున్నారంటూ దుర్భాషలాడారు. దీంతో ఆమె కొడుకు అక్షయ్ రెడ్డి, మరిది మహేందర్ రెడ్డితో పాటు మరోవ్యక్తి, ఇతర అనుచరులు ఆగ్రహంతో అక్కడున్న వారిపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారు.
ఏఎస్సై మోహన్ రెడ్డి అనుచరుల హల్చల్
పలువురు లాయర్లు వారిని అడ్డుకుని, ఎవరైనా ఫొటోలు తీస్తే జడ్జికి ఫిర్యాదు చేయాలని చెప్పారు. కోర్టు ఆవరణలో దాడికి పాల్పడడం సరికాదని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినిపించుకోలేదు. దుర్భాషాలాడారు. దీంతో, మిగతా న్యాయవాదులు వారిని ప్రతిఘటించారు.
ఏఎస్సై మోహన్ రెడ్డి అనుచరుల హల్చల్
దీంతో న్యాయస్థానం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని మోహన్ రెడ్డి అనుచరులను అదుపులోకి తీసుకొని కోర్టు బయటకు తీసుకెళ్లి వదిలేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఏఎస్సై మోహన్ రెడ్డి అనుచరుల హల్చల్
కోర్టు ఆవరణలోనే లాయర్ల పైన మోహన్ రెడ్డి అనుచరులు దౌర్జన్యం చేశారంటూ బార్ అసోసియేషన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొరివి వేణుగోపాల్, బి రఘునందన్ రావులు పోలీసులకు సమాచారమిచ్చారు. జిల్లా జడ్జి నాగమారుతి శర్మకు విషయం చెప్పారు.
ఏఎస్సై మోహన్ రెడ్డి అనుచరుల హల్చల్
జిల్లా ఎస్పీతో మాట్లాడి చర్యలు తీసుకొనేలా ఆదేశిస్తామని జడ్జి తెలిపారు. సీఐ హరిప్రసాద్ జిల్లా కోర్టుకు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. మోహన్ రెడ్డి అనుచరులు పదిమందిపై కేసు నమోదు చేశారు.
ఏఎస్సై మోహన్ రెడ్డి అనుచరుల హల్చల్
లాయర్లపై దౌర్జన్యానికి పాల్పడ్డవారిని వెంటనే అరెస్టు చేయాలని, లేదంటే ఆందోళనలు చేపడతామని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్(ఐలా) హెచ్చరించింది.