అదిక ఫీజులు వసూలు చేసే కాలేజీలకు సుప్రీం కోర్ట్ చెక్..!ఇంజనీరింగ్ విద్యార్థులకు ఊరట..!!
దిల్లీ/హైదరాబాద్ : ఫీజుల చెల్లింపు విషయంలో తెలంగాణలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరట లభించింది. రుసుముల నిర్ణయాధికారం తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)దేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాసవి, శ్రీనిధి కళాశాలల ఫీజుల పెంపు విషయంలో హైకోర్టు పరిధికి మించి వ్యవహరించిందని అభిప్రాయపడింది. దీంతో ఇంజినీరింగ్ కళాశాలలకు సుప్రీం తీర్పు షాక్ ఇచ్చినట్లయింది. ఇక రాష్ట్రంలో కళాశాలలను కూడా కట్టడి చేయడానికి అవకాశం ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఫీజులుంపై సుప్రీం కొరడా..! ఇంజినీరింగ్ విద్యార్థులకు ఊరట..!!
ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ, న్యాయవిద్య, ఎంబీఏ తదితర కళాశాలలకు ప్రతి మూడేళ్లకు ఒకసారి టీఏఎఫ్ఆర్సీ వార్షిక రుసుములను నిర్ణయిస్తుంది. ఆ కమిటీ 2016-17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాలకు 2016 జులైలో రుసుములను ఖరారు చేసింది. అయితే అవి తమకు సమ్మతం కాదని, వాటిని పెంచాలని శ్రీనిధి, వాసవి, సీబీఐటీ, ఎంజీఐటీ కళాశాలలు 2016లో హైకోర్టును ఆశ్రయించాయి. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం కళాశాలలు ప్రతిపాదించుకున్న రుసుములను వసూలు చేసుకోవచ్చని.. అయితే అది కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని 2018లో తీర్పునిచ్చింది. ఆ కళాశాలల్లో భారీగా రుసుములు చెల్లించాల్సి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. శ్రీనిధి, వాసవి కళాశాలల్లో పేరెంట్స్ అసోసియేషన్లు ఏర్పడ్డాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చొరవ తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, పేరెంట్స్ అసోసియేషన్ రుసుములపై సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.
సాంకేతిక కళాశాలలకు ఎదురుదెబ్బ..!నియంత్రణ కమిటీదే నిర్ణయాధికారమని స్పష్టీకరణ..!!
ఈ పిటిషన్లపై సుదీర్ఘంగా విచారించిన జస్టిస్ అరుణ్మిశ్ర నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఏప్రిల్ 10న తీర్పు రిజర్వులో ఉంచగా.. సోమవారం సుప్రీం జస్టిస్ నవీన్ సిన్హా తీర్పును వెలువరించారు. 'రుసుముల విషయంలో నియంత్రణ కమిటీ సిఫార్సుల్లో హైకోర్టు జోక్యం చేసుకుంది. నిర్ణయం తీసుకొనే అంశంపైనే సమీక్ష ఉంటుంది కానీ తీసుకొన్న నిర్ణయంలో మెరిట్పైన కాదు. న్యాయ సమీక్ష పేరుతో రుసుముల నియంత్రణ కమిటీ పరిధిలోకి వెళ్లి కోర్టులు నిర్ణయం తీసుకోకూడదు. నిపుణుల కమిటీ సిఫార్సుల్లో జోక్యం చేసుకోకూడదు' అని స్పష్టం చేశారు. పేరెంట్స్ అసోసియేషన్ తరఫున న్యాయవాది శ్రావణ్కుమార్, ప్రభుత్వం తరఫున న్యాయవాది వెంకటరెడ్డి, వాసవి కళాశాల తరఫున సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ వాదనలు వినిపించారు.
ఫీజుల పెంపు నేపథ్యం..! ఖండిస్తున్న విద్యార్ధుల తల్లిదండ్రులు..!!
నియంత్రణ కమిటీ కాలపరిమితి ముగిసిందని.. ఆ కమిటీ నిర్ణయించిన రుసుముల వల్ల సంస్థ నష్టపోతుందని నారీమన్ కోర్టుకు తెలిపారు. అయితే హైకోర్టు నిర్ణయించిన రుసుములు ప్రతిబంధకంగా మారాయని పేరెంట్స్ అసోసియేషన్ న్యాయవాది శ్రావణ్కుమార్ పేర్కొన్నారు. ప్రవేశాల రుసుముల నిర్ణయాధికారంలో హైకోర్టు జోక్యం తగదని, నియంత్రణ కమిటీదే తుది నిర్ణయమని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వెంకటరెడ్డి వాదించారు. పేరెంట్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వం వాదనలు అంగీకరించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును పక్కన పెడుతూ ఆదేశాలిచ్చింది. తాజా తీర్పుతో రుసుములను నియంత్రించడంలో టీఎఫ్ఆర్సీ మరింత కఠినంగా వ్యవహరించనుంది.
రుసుములపై మీ జోక్యమేంటని హైకోర్టుకు ప్రశ్న..! ఇక అడ్డుకట్ట పడినట్లేనా!
టీఎఫ్ఆర్సీ నిర్ణయించిన రుసుములను అంగీకరించని యాజమాన్యాలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ వచ్చాయి. ఇక నుంచి అలా చేసేందుకు కళాశాలలు వెనకడుగు వేస్తాయని చెబుతున్నారు. దాంతో ప్రతి మూడేళ్లకు భారీగా రుసుములను పెంచుకునేందుకు కళాశాలలకు అవకాశం ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీం ఉత్తర్వులను అమలు చేయాలి. ఇంజినీరింగ్ ఫీజుల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని పేరెంట్స్ కమిటీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డిని కలిసి విన్నవించింది. న్యాయస్థానం తీర్పును సంపూర్ణంగా అమలు చేయాలని కమిటీ ప్రతినిధులు డా.వంగూరి మద్దులేటి, ఎన్.నారాయణ, శ్రీనాథ్, సురేష్ తదితరులు ఆయనకు విజ్ఞప్తి చేశారు.