కేసీఆర్కు ఝలక్: జంపింగ్ ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు గురువారం నాడు విచారణకు స్వీకరించింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు, స్పీకర్కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ కురియన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇది సీఎం కేసీఆర్, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ అని చెప్పవచ్చు.
ఎమ్మెల్యేల ఫిరాయింపుల పైన గతంలో సంపత్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సింగిల్, డివిజన్ బెంచ్లు అతని పిటిషన్ను కొట్టివేసింది. దీంతో సంపత్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
దీనిపై సంపత్ కుమార్ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేల ఫిరాయింపుల పైన స్పీకర్కు ఫిర్యాదు చేశానని పట్టించుకోలేదన్నారు. హైకోర్టుకు కూడా వెళ్లానని చెప్పారు. అక్కడ చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్టు గడప తొక్కానని చెప్పారు.
కాగా, తెలంగాణలో గత 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెరాస తరఫున 63 మంది గెలిచారు. టిడిపి నుంచి 15 మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి 22 మంది గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడెనిమిది మంది, టిడిపి నుంచి 12 మంది ఎమ్మెల్యేలు కారు ఎక్కిన విషయం తెలిసిందే.