నటి శ్రీసుధపై వేధింపుల కేసు... కెమెరామెన్ శ్యామ్ కె నాయుడుకి సుప్రీం కోర్టు నోటీసులు...
సినీ నటి శ్రీసుధపై వేధింపుల కేసులో టాలీవుడ్ సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె.నాయుడుకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నెలరోజుల్లోగా నోటీసులపై స్పందించాలని ఆదేశించింది. శ్యామ్ కె.నాయుడుతో తనకు ప్రాణహాని ఉందని... ఆయన బెయిల్ రద్దు చేయాలని శ్రీసుధ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ఆమె పిటిషన్పై విచారణ చేపట్టి శ్యామ్ కె.నాయుడికి నోటీసులు జారీ చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో సహజీవనం చేసి మోసగించాడని శ్రీసుధ గతంలో అతనిపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే.
నకిలీ పత్రాలతో బెయిల్ తెచ్చుకున్నాడని...
పెళ్లి పేరుతో నమ్మించి ఐదేళ్లు తనతో సహజీవనం చేసిన శ్యామ్ కె.నాయుడు.. ఆ తర్వాత తనను మోసం చేశారని గత ఏడాది మే 26న శ్రీసుధ మొదటిసారి హైదరాబాద్లోని ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యామ్ కె నాయుడిని అరెస్ట్ చేయగా రెండు రోజుల్లోనే బెయిల్పై బయటకొచ్చాడు.
అయితే ఈ కేసులో తాను రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి కోర్టును తప్పుదోవ పట్టించడం ద్వారా శ్యామ్ కె.నాయుడు బెయిల్ పొందారని శ్రీసుధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పత్రాలు నకిలీవని తేలడంతో అప్పట్లో అతని బెయిల్ కూడా రద్దయినట్లు కథనాలు వచ్చాయి. గత నెలలో మరోసారి ఎస్ఆర్ నగర్ పోలీసులకు శ్యామ్పై ఫిర్యాదు చేసిన శ్రీసుధ.. ఇప్పటివరకూ అతన్ని అరెస్ట్ చేయలేదని ఆరోపించారు.
ఇటీవల విజయవాడ పోలీసులకు ఫిర్యాదు...
ఇటీవల విజయవాడలోని వన్ టౌన్ పోలీసులకు కూడా నటి శ్రీసుధ శ్యామ్ కె నాయుడిపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కనకదుర్గ ఫ్లైఓవర్పై తన కారును ఢీకొట్టించి హత్యాయత్నం చేశారని... ఈ కుట్ర వెనుక శ్యామ్ కె నాయుడు ఉన్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.హైదరాబాద్లో తాను శ్యామ్ కె నాయుడుపై పెట్టిన కేసుకు,ఈ ఘటనకు లింకు ఉందని ఆమె పేర్కొన్నారు. తన అడ్డు తొలగించుకునేందుకు యాక్సిడెంట్లో తనను చంపేసేలా కుట్ర చేసి ఉంటాడని శ్రీసుధ అనుమానం వ్యక్తం చేశారు.శ్యామ్ కె.నాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎస్ఆర్ నగర్ పోలీసులకు రెండుసార్లు ఫిర్యాదు
గత నెలలోనే శ్యామ్ కె నాయుడుపై నటి శ్రీసుధ రెండోసారి ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది అగస్టు 5న మాదాపూర్లోని సినీ ఆర్ట్ డైరెక్టర్ చిన్నా నివాసానికి పిలిపించి శ్యామ్ కె నాయుడు,చిన్నా,సాయిరాం మాగంటితో పాటు మరికొందరు తనను బెదిరింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను దూషించడంతో పాటు,శారీరకంగా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
సినీ ఇండస్ట్రీలో కొనసాగాలంటే రాజీపడక తప్పదని హెచ్చరించినట్లు చెప్పారు. శ్యామ్ కె నాయుడు కుటుంబ సభ్యులతో ప్రాణభయం ఉన్నందునా మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇంతవరకూ అతన్ని అరెస్ట్ చేయలేదని వాపోయారు. ఆమె ఫిర్యాదుపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు... కేసును మాదాపూర్ పీఎస్కు బదిలీ చేస్తున్నట్లు చెప్పారు.