చిన్నారిపై హత్యాచారం కేసు: నిందితుడికి ఆ శిక్ష సరైనదేనన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: హన్మకొండలో 9 నెలల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు ప్రవీణ్కు విధించిన శిక్ష విషయంలో దాఖలైన పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది. నిందితుడికి కింది కోర్టు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షకు తగ్గిస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పు దోషికి పూర్తిస్థాయి శిక్షను విధించినట్లుగానే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరణశిక్ష విధిస్తే నేరస్థులకు సరైన సంకేతాలు వెళ్తాయన్న ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలను విన్న సుప్రీంకోర్టు.. తుదిశ్వాస విడిచేవరకు జైలుశిక్ష కూడా సరైన సంకేతాలనే ఇస్తుందని అభిప్రాయపడింది.
రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను కొట్టేసిన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ తో కూడిన ధర్మాసనం.. ఈ మేరకు లిఖితపూర్వక ఆదేశాలను జారీ చేసింది. కాగా, 2019, జూన్ 6న హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే.
ఈ కేసులో నిందితుడు ప్రవీణ్కు కింది కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే, హైకోర్టును ఆశ్రయించగా.. ఆ శిక్షను యావజ్జీవ శిక్షకు తగ్గిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే, అతడు తుదిశ్వాస విడిచే వరకు కూడా జైలు జీవితాన్ని అనుభవించాలని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, అతడ్ని ఉరితీయాలనే డిమాండ్లు వినిపించిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లింది ఈ కేసు. దీంతో తాజాగా, సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది.