తెలంగాణా ఇంజినీరింగ్ కాలేజ్ ఫీజుల విషయంలో సుప్రీం సంచలన తీర్పు .. కాలేజీలకు షాక్
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఫీజులు విషయంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇక కళాశాలల్లోని ఫీజులు ఎవరికి వారు నిర్ణయించుకోడానికి వీల్లేదని తెలంగాణ ఫీజుల నియంత్రణ కమిటీకే ఫీజులను నిర్ణయించే అధికారం ఉంటుందని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. దీంతో కళాశాలల్లో ఫీజులు పెంచాలని భావించిన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యానికి చుక్కెదురైంది.
Recommended Video
ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు పెంచుకోవటం యాజమాన్యం ఇష్టం అని తీర్పునిచ్చిన హైకోర్టు
తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి. ఇప్పటికే విపరీతంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఫీజులు ఉండగా అవి కట్ట లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఫీజులను నియంత్రించాలనే ఉద్దేశంతో ఉన్న తెలంగాణ సర్కార్ ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల పెంపును నిరాకరించింది. కళాశాల ఫీజు లు పెంచాలని ప్రభుత్వాన్ని కోరిన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హై కోర్టును ఆశ్రయించాయి. ఆరు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు తమ కళాశాలలో ఫీజులు పెంచాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి ఫీజుల పెంపు ను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.
ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయం ప్రకారమే ఫీజులు ఉండాలన్న సుప్రీం ధర్మాసనం
ఇక దీంతో విద్యార్థులపై పెను భారం పడుతుందని భావించిన తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇంజినీరింగ్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ వాసవి కాలేజ్ పేరంట్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో పిటీషన్ వేసింది.
ఇక ఈ వ్యవహారంపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తెలంగాణలో ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయం ప్రకారమే ఫీజులు ఉండాలని సూచించింది. అంతేకాదు తెలంగాణ హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించకూడదని సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది.
తెలంగాణా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించిన సుప్రీం కోర్టు
వాసవి ఇంజినీరింగ్ కళాశాల ఫీజుల వ్యవహారంపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.ఫీజు నిర్ణయాధికారం కాలేజీలకు ఇవ్వాలని కళాశాల తరపు న్యాయవాది కోరారు. ఫీజు నిర్ణయంపై వాసవి కళాశాల తరపు న్యాయవాది వాదనలతో సుప్రీం ఏకీభవించలేదు. ప్రైవేటు కళాశాలలు ఎలా నడుస్తాయో తమకు తెలుసని ధర్మాసనం పేర్కొంది. ఇక ప్రైవేటు కాలేజీలు ఫీజులు నిర్ణయిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మాకు తెలుసు అన్నారు. వాసవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల ఫీజుల విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం పక్కన పెట్టింది. ఫీజులు పై నియంత్రణ ఉండాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది సుప్రీం ధర్మాసనం.