కేసీఆర్ కు 'సుప్రీం షాక్' తప్పదు : పొంగులేటి హెచ్చరిక
హైదరాబాద్ : గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ, అరుణాచల్ ప్రదేశ్ లో ప్రజా ప్రభుత్వాన్ని పునరుద్దరించాలన్న సుప్రీం తాజా తీర్పుపై కాంగ్రెస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీం తీర్పు మోడీకి చెంప దెబ్బ లాంటిదని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతుంటే.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా అవే వ్యాఖ్యలను ఉటంకించారు.
సుప్రీం తాజా నిర్ణయంపై స్పందించిన పొంగులేటి.. ప్రధాని మోడీకి ఇదో చెంపు పెట్టు అని, సీఎం కేసీఆర్ కు కూడా ఇదే తరహా భంగపాటు తప్పదని హెచ్చరించారు. బుధవారం నాడు గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘిస్తోన్న కేసీఆర్ కు కూడా సుప్రీంలో భంగపాటు తప్పదన్నారు.
విపక్షాలకు చెందిన 47 మంది ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్ లో చేర్చుకుని, కేసీఆర్ ఫిరాయింపు చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డారని మండిపడ్డారు పొంగులేటి. తెలంగాణ నేతల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి న కేసు ఈ నెల 18న సుప్రీంలో విచారణకు వస్తున్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన, కేసులో కేసీఆర్ కు చుక్కెదురవక తప్పదన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు.
అలాగే ఫిరాయింపులకు బ్రేక్ వేసేందుకు త్వరలోనే పార్లమెంట్ లో ప్రైవేటు బిల్లు పెట్టే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టు తెలిపారు. ఫిరాయింపుల విషయంలో అసెంబ్లీ స్పీకర్, శాసన మండలి స్పీకర్ ల పనితీరును తప్పుబట్టిన పొంగులేటి, ఫిరాయింపులకు పాల్పడ్డ 47 మందిపై అనర్హత వేటు పడడం ఖాయమన్నారు.
అంతేకాదు, అనర్హత వేటుతో ఆయా నియోజకవర్గాల్లో ఆరు నెలల్లోగా ఉపఎన్నికలు రావడం ఖాయమంటున్నారు పొంగులేటి. కాగా, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లడాన్ని క్విడ్ ప్రొకో వ్యవహారంగా అభివర్ణించిన ఆయన, దాన్ని ఆధారాలతో సహా బయటపెడుతానని తెలిపారు.