"చంద్రబాబు గుర్తించారు, కెసిఆర్ మోడీకి వందిమాగధుడిలా మారారు"
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీకి కెసిఆర్ వందిమాగధుడిగా మారారని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రధాని నరేంద్ర మోడీకి వందిమాగధుడిలా తయారయ్యారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఆరోపించారు. సిద్ధిపేటను నగదు రహితం చేస్తానంటూ మంత్రి హరీశరావు ముఖ్యమంత్రికి వంతపాడుతున్నారని అన్నారు. మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం చాలా గొప్పదని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొ దట్లో బాకా ఊదారని ఆయన గుర్తు చేశారు.
అయితే నోట్ల రద్దుతో ఎదురవుతున్న కష్టాలను చంద్రబాబు ఆలస్యంగానైనా గుర్తించారని ఆయన అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం తన స్వప్రయోజనాల కోసం మోదీ నిర్ణయాన్ని పొగుడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం మగ్ధూం భవనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గుండా మల్లేశ, పల్లా వెంకటరెడితో కలిసి సురవరం మీడియాతో మాట్లాడారు.
'పెద్ద నోట్ల రద్దు-నల్ల కుబేరులకు రక్ష-సామాన్యులకు శిక్ష' వ్యాస సంకలనాన్ని ఆయన ఆవిష్కరించారు. యాభై రోజుల గడువు ముగిసినా నోట్ల రద్దు కష్టాలు కొనసాగుతున్నాయని, లక్ష్యం ఏ మేరకు నెరవేరిందో ప్రధానే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
నయీం కేసులో ఏ ఒక్కర్నీ వదలబోమని కేసీఆర్ అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ను చూ స్తుంటేఎవర్నీ పట్టుకోబోమని స్పష్టమవుతోందన్నారు. తెరాస నాయకుల పాత్ర ఉంది కాబట్టే ప్రభుత్వం నయీం కేసులో యూటర్న్ తీసుకుందని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త భూసేకరణ చట్టం పరమ నికృష్టమైనదని, దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. రైతు, రాజ్యాంగ వ్యతిరేక చట్టంగా అభిప్రాయపడింది. పార్లమెంటు రూపొందించిన చట్టానికి మద్దతిచ్చిన నాటి ఎంపీ, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని విమర్శించింది.
పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం శుక్రవారం మగ్దూం భవనలో జరిగింది. రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో చేసిన తీర్మానాలను పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో శుక్రవారం విడుదల చేశారు.