వెంకయ్య ఒప్పుకోవడం సంతోషం: సురవరం, యాగంపై కెసిఆర్కు సూటి ప్రశ్న
హైదరాబాద్: దేశంలో కొంచెం అసహనముందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఒప్పుకోవడం సంతోషకరమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
దేశంలో స్పష్టమైన విదేశీ విధానం కరువైందని సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వం మతాల పండగలు చేయడం అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
ఆయూత చండీ యాగం ప్రభుత్వానిదా లేక సొంతంగా చేసుకుంటున్నారో ప్రకటించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా చాడ వెంకట రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పువ్వాడ నాగేశ్వరరావు శనివారం నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పారు. అధికార టిఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించడం దారుణమని అన్నారు.
సీనియార్టీ ప్రాతిపదికన పర్మినెంట్: నాయిని
తెలంగాణలో 16వేల మంది హోంగార్డులు పని చేస్తున్నారని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. వారందరినీ ఒకేసారి పర్మినెంట్ చేస్తే ఖజానాపై ఆర్థిక భారం పడుతుందన్నారు. సీనియార్టీ ప్రాతిపదికన పర్మనెంట్ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్తో చర్చించి హోంగార్డుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.