సురేశ్కు ఉరిశిక్ష విధించేలా విచారణ..? ఇతరుల సహకారంపై సీపీ ఆరా, విజయ భర్త ఉన్నతోద్యోగే..
అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై విచారణ జరుగుతుందని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. నిందితుడు సురేశ్ తమ అదుపులోనే ఉన్నారని పేర్కొన్నారు. అతను కూడా 60 శాతం కాలిన గాయాలతో ఉన్నాడని.. అతని పరిస్థితి సీరియస్గా ఉందన్నారు. దాడికి గల కారణాలు విచారణలో తెలుస్తాయని వెల్లడించారు.
ఆఫీసులోనే హత్య..?
కార్యాలయంలోనే అధికారిని హత్య చేయడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. విజయారెడ్డిపై దాడికి సంబంధించిన ఘటనపై నిష్పాక్షిపాతంగా విచారిస్తామని మహేశ్ భగవత్ మీడియాకు తెలియజేశారు. పనిచేసే చోట మండల మెజిస్ట్రేట్.. అలాంటి అధికారిపై దాడిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిని పోలీసులు కూడా సవాల్గా భావించారు. నిందితుడికి శిక్షపడేలా విచారణ చేపడుతామని.. త్వరగా ఎంక్వైరీ పూర్తిచేసి సాక్ష్యాధారాలు కోర్టుకు అందజేస్తామని తెలిపారు.
ఉరిశిక్ష పడేలా చేస్తాం..?
ఫాస్ట్రాక్ కోర్టుకు ఆధారాలు అందజేసి నిందితుడికి ఉరిశిక్ష పడేలా చూస్తామని చెప్పారు. మరొకరు అధికారిపై దాడి చేయాలంటే భయపడేలా విచారణ ఉంటుందని చెప్పారు. ఎంక్వైరీ కూడా త్వరగా పూర్తిచేస్తామని భరోసానిచ్చారు. అంతేకాదు విజయారెడ్డిపై సురేశ్ దాడి చేయడానికి కారణం.. అతని సలహాతోనే చేశాడు.. మరెవరైనా సహకారం అందించారా అనే విషయం విచారణలో తేలుతుందన్నారు. ఓ అధికారిని మట్టుబెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చిందనే అంశాన్ని త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.
ఇదీ విజయారెడ్డి నేపథ్యం..
పుట్టా విజయారెడ్డి ఉన్నత కుటుంబం నుంచి వచ్చారు. ఆమె 2009లో గ్రూప్-2 పోస్టునకు ఎంపికయ్యారు. భర్త సుభాష్ రెడ్డి కూడా మంచి హోదాలో ఉన్నారు. డిగ్రీ కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్నారు. వీరి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమ్మాయి ఒకరు, అబ్బాయి ఒకరు ఉన్నారు. విజయారెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా మునుగొడు మండలం కల్వలపల్లి.. విజయారెడ్డి మృతితో కల్వలపల్లి, పుట్టినిల్లు.. నకిరేకల్ తోటపల్లిలో విషాద వదనం నెలకొంది.
సురేశ్ హిస్టరీ..
విజయారెడ్డిని దారుణంగా హతమార్చిన కూర సురేశ్ యువ రైతు. అయితే తన భూమి రిజిస్ట్రేషన్ విషయంలో తిప్పించుకోవడంపై ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది. తన పని కాదని భావించి.. దారుణానికి ఒడిగట్టినట్టు ప్రాథమికంగా తెలిసింది. సురేశ్ స్వస్థలం హయత్నగర్ మండలం గౌరెల్లి గ్రామం. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సురేశ్.. ఇదివరకు హింసాత్మకంగా ఎప్పుడూ ప్రవర్తించలేదని గౌరెల్లి వాసులు చెప్తున్నారు.